నరసాపురం, ఏప్రిల్ 9: జనసైనికుల ప్రవర్తన పది మందికి ఆదర్శంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగింపు రోజైన మంగళవారం తన అన్న, ప్రముఖ నటుడు నాగబాబు పోటీ చేస్తున్న నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. లోక్సభ పరిధిలోని పాలకొల్లు, నరసాపురం, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భీమవరం అసెంబ్లీ నుండి పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసేందే. పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా భీమవరంలో స్థానిక నాయకులే జనసేనాని పవన్ విజయాన్ని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారాలను నిర్వహించారు. పార్లమెంట్ అభ్యర్థి కొణిదెల నాగబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనగా పాలకొల్లు సభలో వీరి అల్లుడు, సినీనటుడు అల్లు అర్జున్ (బన్ని) సభకు హజరై కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపారు.
ఈ సభల్లో పవన్ కళ్యాణ్ టిడిపి అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహనరెడ్డిలను విమర్శించారు. ఎమ్మెల్యేలు పకృతి సంపద దోచుకుంటున్నారని అన్నారు. ఇసుక, మట్టి దోపిడీ చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మంచి వ్యక్తులు కూడా అవినీతి పార్టీలో చేరి పోటీ చేయడం బాధకల్గిస్తుందని పవన్ అన్నారు. ఎవరి వల్ల మనకు, సమాజానికి మేలు జరుగుతుంది అని ఆలోచించి ఓట్లు వేయాలని పవన్ సూచించారు. జనసేన అభ్యర్థులు వారు గెలిస్తే ఏమి చేయనున్నారో వివరిస్తూ బాండ్ పేపర్పై రాసి ఇస్తున్నారనీ, దీని వల్ల నాయకుడి తాలూకు వ్యక్తిత్వం బయటపడుతుందని పవన్ అన్నారు.
మార్పు కోసమే జనసేన ఆవిర్భవించిందని పవన్ పునర్ఘాటించారు. పార్టీ నేతలు, జన సైనికుల ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా ఉండాలనీ, మన శత్రువులు కూడా అభిమానించే విధంగా జనసైనికుల ప్రవర్తన ఉండాలని పవన్ సూచించారు. ఇద్దరు కంసులతో జనసేన పోటీ పడుతోందని అన్నారు.
బిఎస్పి అధినేత్రి మాయావతికి తాను పాదాభివందనం ఎందుకు చేశాను అన్న దానిపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని సాధారణ కుటుంబం నుండి వచ్చిన ఆడపడుచు మాయావతి స్వయంకృషితో నాలుగు సార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారని పవన్ అన్నారు. తల్లిగా భావించి మాయావతికి తాను పాదాభివందనం చేశానని పవన్ వివరించారు.
ఆమెది మాటలతో తప్పించుకునే వ్యక్తిత్వం కాదని పవన్ అన్నారు. ఈ దేశానికి మాయావతి ప్రధాని కావాలని తన ఆకాంక్ష అని పవన్ పేర్కొన్నారు.