(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒదిషాలో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార, నాగావళి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో శ్రీకాకుళం జిల్లాకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
హీరమండలం గొట్టా బ్యారేజీకి వరద నీరు పొటెత్తుతోంది. బ్యారేజీకి 1,12,210 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతుండటంతో బ్యారేజ్ వద్ద అధికారులు మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గొట్టా బ్యారేజ్ వద్ద ఇంజనీర్లు వరద తీవ్రతను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తున్నారు.
తోటపల్లి జలాశయానికి 42,579 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 50,611 క్యూసెక్కుల నీరు కిందకి వదులుతున్నారు. నారాయపురం ఆనకట్ట వద్ద నాగావళి జోరుగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహాక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల విఆర్ఒలు అందుబాటులో ఉండాలని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వరద పరిస్థితి గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. నదులు, వాగులను ప్రజలు దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరికలు జారీ చేయాలని మంత్రి సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి చెప్పాలని కలెక్టర్ తెలిపారు