గుంటూరు: తెలంగాణలో అబ్దుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం తరువాత తరచుగా బాధితులు రెవెన్యూ అధికారులను బెదిరించడం అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి తహశీల్ధార్ కార్యాలయంలో నేడు ఒక రైతు పెట్రోల్ బాటిల్తో రావడం కలకలం రేపింది.
శివకోటేశ్వరరావు అనే రైతు పెట్రోల్ బాటిల్తో కార్యాలయానికి చేరుకుని ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించాడు. పట్టాదారు పుస్తకం జారీలో సిబ్బంది అలసత్వం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘సమస్యను పరిష్కరిస్తారా లేక పెట్లోల్ పోసుకోమంటారా లేదా పోయాలా అంటూ’ సిబ్బందిని నిలదీశాడు. దీంతో కార్యాలయ సిబ్బంది పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని అతని వద్ద నుండి పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. శివకోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
ఇటువంటి సంఘటనే ఇటీవల పలు ప్రాంతాల్లో జరిగాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహశీల్దార్ కార్యాలయంలో తన భూ సమస్య పరిష్కరించడం లేదంటూ కనకయ్య అనే రైతు పెట్రోల్ బాటిల్తో కార్యాలయంలోకి ప్రవేశించి కంప్యూటర్లపై చల్లాడు. పక్కనే ఉన్న సిబ్బంది, అధికారులపైనా పెట్రోల్ చుక్కలు పడ్డాయి. దీంతో ఒక్క సారిగా వారు ఆందోళన చెందారు.
ఈ నెల 11వ తేదీన అనంతపురం జిల్లా గుమ్మగడ్డ తహశీల్దార్ కార్యాలయంలో జయరామిరెడ్డి అనే రైతు తన సమస్య పరిష్కరించడం లేదంటూ పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు.
సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధితులు ఇటువంటి ఫందా ఎంచుకోవడం రెవెన్యూ వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నది.