విజయవాడ: ఏపీ రాజధాని మార్పుకు ప్రజల ఆమోదం లేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. మంగళవారం విజయవాడలో తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ రాజధాని అమరావతిని మార్చే ప్రసక్తే లేదని వైసీపీ నేతలు గతంలో చాలాసార్లు చెప్పారని, తన మేనిఫెస్టోలో జగన్ పెట్టలేదని చెప్పారు. మూడు రాజధానులు ఏర్పాటు చేసి విఫలమయ్యామని దక్షిణాఫ్రికా నేతలే చెబుతున్నారని గుర్తుచేశారు. రాజధాని గురించి జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని విమర్శించారు. రైతుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తున్నాయని పేర్కొన్నారు.
అమరావతి అంశం చాలా ముఖ్యమైందని, నలభై రెండు రోజులుగా రాజధాని రైతులు చేస్తున్న దీక్షను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇంతవరకు సీఎంగాని, మంత్రులుగాని వాళ్లతో మాట్లాడలేదని ఎంపీ గల్లా ధ్వజమెత్తారు. శాంతియుత పద్ధతిలో ఇటీవల ‘ఛలో అసెంబ్లీ’ నిర్వహిస్తున్న రైతులపై, తనపై పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమని విమర్శించారు. పోలీసులపై తాను రాళ్లు రువ్వానని తనపై కేసు పెట్టారని, ఆపని తాను గానీ తనతో ఉన్న రైతులు గానీ చేయలేదని మరోమారు స్పష్టం చేశారు. మఫ్టీలో ఉన్న పోలీసులే ఈ పని చేశారని ఆరోపించారు. రాష్ట్రానికి మధ్యలోనే రాజధాని ఉండాలని గతంలో జగన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎనిమిది నెలలుగా అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానులు అనే పదాన్ని తొలిసారిగా వింటున్నామన్నారు.