(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉంది. గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాలను ముమ్మరం చేశారు. నోటిఫికేషన్ నాటి నుంచే మిగిలిన పార్టీల కంటే ప్రచార రేసులో ముందుగా బరిలోకి దిగింది టీఆర్ఎస్. ఎన్నికలు ఏవైనా విజయం తమదే అన్నట్లుగా అలవాటు చేసుకున్న గులాబీ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. మెజారిటీ మున్సిపల్, కార్పోరేషన్లలో తమదే విజయమనే ధీమాతో ఉంది.
అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా మున్సిపల్ ఎన్నికలకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. టీఆర్ఎస్ వైఫల్యాలు విమర్శిస్తున్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను.. కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపిస్తూ ప్రచారం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలలే ఎన్నికల్లో గెలుపిస్తాయని, అన్ని మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగుర వేస్తామని ఆపార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచే అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఒకప్పుడు గ్రేటర్ హైదరాబాద్ తోపాటు శివారు ప్రాంతాల్లో కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు నామినేషన్లు వేసిన వారి సంఖ్య సింగిల్ డిజిట్కే పరిమితమైంది. రెండు, మూడుచోట్ల మాత్రం డబుల్ డిజిట్లో నామినేషన్లు ఉన్నాయి. మొదటిస్థానంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ఉంటే, కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా? అన్నట్లుగా ఉన్నాయి. కొన్నిచోట్ల బీజేపీ పరిమిత వార్డుల్లోనే తమ అభ్యర్థులను పోటీకి దించింది. సీపీఐ, సీపీఎం పార్టీలు అన్ని వార్డుల నుంచి పోటీలో తమ అభ్యర్థులను నిలపకుండా అక్కడక్కడ ఎంపిక చేసిన స్థానాల్లోనే పోటీలో ఉంచింది.
మరోవైపు పురపాలిక ఎన్నికల్లో బుజ్జగింపుల పర్వం జోరుగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణకు మూడు రోజుల గడువే ఉండటంతో ఆశావహుల్ని బుజ్జగిస్తున్నారు. రాష్ట్రంలో 120 మున్సిపాలిటిల్లో 2,727 వార్డులు, పది కార్పొరేషన్ లోని 385 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 30,800కుపైగా నమినేషన్లు దాఖలయ్యాయి. సగటున ప్రతి వార్డుకు పది మందికిపైగా నామపత్రాలు దాఖలు చేశారు. తెలంగాణలో అత్యధికంగా టీఆర్ఎస్ తరుపున నామినేషన్లను దాఖలు చేశారు. ఈ నెల 14న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏ పార్టీ నుంచి ఎంతమంది బరిలో ఉంటారన్నది స్పష్టంగా తేలుతుంది. తిరుగుబాటు అభ్యర్థులు లేకుండా చూసుకునేందుకు పార్టీల నేతలు తంటాలు పడుతున్నారు. వారిని సముదాయించే బాధ్యతను స్థానిక నేతలకే అప్పగించారు. దీంతో ప్రస్తుతం పార్టీలపరంగా వేసిన నామినేషన్లు బాగా తగ్గిపోయే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎక్కువ పట్టణ స్థానిక సంస్థలున్న రంగారెడ్డి జిల్లాలో 2,392 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు ఉన్న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 1,910 నామినేషన్లు నమోదయ్యాయి. అయితే అతి తక్కువ నామినేషన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 134 మాత్రమే ఉన్నాయి. ఈ నెల 22వ తేదీన జరిగే మున్సిపల్ ఎన్నికల పోలింగ్కు 36 గంటల ముందుగా అంటే జనవరి 20వ తేదీ సాయంత్రం ప్రచారం ముగించాల్సి ఉంటుంది.