హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచారణకు హాజరుకానుండడంతో శుక్రవారం హైదరాబాద్ లోని సీబీఐ కోర్టు దగ్గర భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణకు జగన్ స్వయంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేయడంతో శుక్రవారం వ్యక్తిగతంగా హాజరు అవుతున్నారు. ఈ కేసులో ఆయనతోపాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు దగ్గర పోలీసు భద్రత కల్పించాల్సిందగా ఏపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ పోలీసులకు లేఖ అందింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైదరాబాద్ నగర పోలీసులు కమిషనర్ సీబీఐ కోర్టు దగ్గర తగిన పోలీసు భద్రత కల్పించడంపై దృష్టి పెట్టారు. సీఎం హోదాలో తొలిసారిగా జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకానున్నారు.
ఏపీ సీఎం కాక ముందు ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ సీబీఐ కోర్టు హాజరయ్యేవారు. ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర సమయంలోనూ ఆయన కోర్టు హాజరయ్యారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్.. రాష్ట్ర పాలనాపరమైన అంశాలతో బిజీ అయ్యారు. దీంతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు ముందుగానే కోర్టుకు నివేదించారు. వ్యక్తిగతంగా కోర్టు హాజరు కాలేనని తెలిపారు. ఆయన తరఫున లాయర్లు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేసి అనుమతి తీసుకుంటున్నారు. అయితే, వరుసగా హాజరు కాకపోవడం వల్ల విచారణపై ప్రభావం చూపుతోందంటూ సీబీఐ తరఫు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రతిసారి మినహాయింపు ఇవ్వడం సరికాదన్నారు. దీంతో జనవరి 10న కోర్టుకు తప్పనిసరిగా జగన్, విజయసాయిరెడ్డిలు హాజరు కావాల్సిందేనని కోర్టు వారిద్దరి తరఫు న్యాయవాదులకు స్పష్టం చేసింది. దీంతో జగన్ వ్యక్తిగతంగా హాజరు కావడం అనివార్యమైంది.