గత కొంత కాలంగా భారత్ -చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చైనాకు చెందిన టిక్ టాక్, షేర్ ఇన్, యూసీ బ్రౌజర్ లాంటి 59 రకాల యాప్ లను భారత ప్రభుత్వం నిషేదింది. టిక్ టాక్ ఇండియాలో ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పాల్సిన పనిలేదు. భారత దేశంలో స్మార్ట్ ఫోన్ లు వినియోగించే దాదాపు 20కోట్ల మంది టిక్ టాక్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు అంటే దీనికి ఎంత క్రేజ్ ఉన్నదో అర్ధం అవుతున్నది.
ఈ తరుణంలో టిక్ టాక్ యాజమాన్య సంస్థ బైట్ డాన్స్ ఈ యాప్ పై చైనా ముద్రను తొలగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా టిక్ టాక్ పై భారత ముద్ర పడేలా చేసేందుకు గాను భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడులను ఆకట్టుకునేందుకు చర్చల ప్రక్రియ ప్రారంభిన్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్ టాక్ కు దేశంలో ఉన్న ప్రాచుర్యం కారణంగా టిక్ టాక్ యాజమాన్య ప్రతిపాదనపై రిలయన్స్ అధినేత అంబానీ సానుకూలంగా స్పందించే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇదే క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా తమ దేశంలో టిక్ టాక్ ను నిషేదిస్తున్నట్లు ప్రకటించారు. సెప్టెంబర్ 15లోగా టిక్ టాక్ ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ కు సూచించారని వార్తలు వస్తున్నాయి. దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈఒ సత్య నాదెండ్ల అటు టిక్ టాక్ యాజమాన్యంతో చర్చించడంతో పాటు ట్రంప్ తోనూ ఫోన్ లో మాటాడినట్లు సమాచారం. మరో పక్క ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ లు కూడా టిక్ టాక్ లో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉందని అంటున్నారు. రిలయన్స్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వీటిలో ఏ సంస్థ టిక్ టాక్ ను కొనుగోలు చేసినా దానిపై చైనా ముద్ర చెరిగిపోతుంది తద్వారా నిషేధం తొలగిపోతుంది అని టిక్ టాక్ యూజర్లు భావిస్తున్నారు.