(చిత్తూరు నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
కరోనా వచ్చింది..! తగ్గి పోయింది..! ఇక నాకు ఎదురులేదు..! యదేఛ్చగా తిరిగేయవచ్చు..! కరోనా నా దరి చేరదు..! అనుకుంటున్నారా..? అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే..! అలా తిరిగిన ఒ అధికార పార్టీ నేతే మరో సారి కరోనా బారిన పడ్డారు. ఆ నాయకుడు ఎవరు? ఆయనకు మరో సారి ఎందుకు కరోనా సోకింది? అనేది తెలుసుకుందాం..
చిత్తూరు జిల్లా తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండవ సారి కరోనా సోకింది. ఒ ప్రైవేటు పరీక్షా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పరీక్షలో కరోనా పాటిజివ్ నిర్ధారణ అయ్యింది. నేడు మరో సారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని వైద్యాధికారుల సూచనల మేరకు వైద్యసేవలను ఆయన పొందనున్నారు.
భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడుకి ఆగస్టు చివరి వారంలో కరోనా సోకింది, వెంటనే వారు తిరుపతి రూయా ఆసుపత్రిలో చేరి వైద్య సేవలు పొందారు. కొద్ది రోజులకు కరోనా తగ్గిపోవడంతో వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఇంకే ముందే కరోనా వచ్చింది, తగ్గిపోయింది, ఇక నా దరి చేరదు అనుకున్నారో ఏమో కరుణాకర్ రెడ్డి. గత కొద్ది రోజులుగా ఆయన తిరుపతిలో కరోనాపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. ఇప్పుడు ఆయనకు మరో సారి కరోనా పొజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కల్గిస్తున్నది.
దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నూటికి 60 నుండి 70 శాతం మంది హాస్పటలైజేషన్ కాకుండానే సాధారణ వైద్య సేవలతోనే కరోనా బారి నుండి విముక్తులు అవుతున్నారు. 20 నుండి 30 శాతం మందికి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందిన తరువాత కరోనా నయం అవుతోంది. రెండు నుండి మూడు శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు మాత్రం కరోనాను జయించలేక మృతి చెందుతున్నారు.
అయితే సాధారణంగా ఒక సారి కరోనా సోకి తగ్గిపోతే మరో సారి కరోనా అటాక్ కాదు చాలా మంది విశ్వసిస్తున్నారు. అయితే వైద్యులు మాత్రం కరోనా వచ్చి తగ్గిపోయినా మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా కరోనా నుండి కోలుకున్న వారు యదేశ్చగా తిరిగేయ్యడంతో ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. కరోనాపై ప్రతి ఒక్కరూ అప్రమత్తతో ఉండాల్సిందే సుమీ.