(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల గడువు తరుముకొస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చతికిలపడిన పార్టీల్లో మాత్రం ఇప్పటికీ ఉలుకూపలుకూ లేదు. అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్ద అన్న ఊగిసలాట ప్రదర్శిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మున్సిపల్ ఎన్నికలపై దూకుడు ప్రదర్శిస్తుంటే.. కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జన సమితి, వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలు ఎన్నికల్లో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. పోటీ చేయాలా ?లేదా? ఎన్నికలకు దూరంగా ఉండి పరువు కాపాడుకుందామా? అన్న ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇప్పటికీ ఈ మూడు పార్టీల్లో ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కసరత్తు లేకపోవడంతో ఆయా పార్టీల మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో జట్టుకట్టిన కాంగ్రెస్ పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒంటరిపోరుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. పార్టీ నిర్ణయాన్ని క్యాడర్కు ఇప్పటికే చేరవేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, తెలంగాణ జన సమితి, సీపీఐతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగిందన్న భావనలో కాంగ్రెస్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి మూడు ఎంపీ సీట్లు గెలిచింది. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఒంటరి పోరాటం వైపే మొగ్గు చూపింది. అయితే, తెలంగాణ టీడీపీ మాత్రం మరోసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఆపార్టీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రాథమిక చర్చలు చేస్తున్నారు.
మరోవైపు టీజేఎస్, సీపీఐ, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బీఎల్ఫ్ పార్టీలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగినా ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఈ మూడు పార్టీల్లో ఒక్కో పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. సీపీఎం ఖమ్మం, నల్గొండలో కూడా ప్రభావం కోల్పోయింది. హుజూర్నగర్ ఎన్నికల ఫలితంతో ఇది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటాయా? లేదా ? అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే, టీజేఎస్, సీపీఐ, సీపీఎంలతో ఎటువంటి ఉపయోగం లేదని ప్రధాన పార్టీలు యోచిస్తున్నాయి. దీంతో ఈ మూడు పార్టీలో మున్సిపల్ బరిలో ఉంటాయా? లేదా? అన్నది చూడాలి.