న్యూఢిల్లీ: తమకు విధించిన ఉరి శిక్ష అమలును సవాల్ చేస్తూ నిర్భయ దోషులు దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు వినయ్, ముఖేశ్ క్యురేటివ్ పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పిటిషన్లను తోసిపుచ్చింది. ఈ నెల 22న ఉదయం ఏడు గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఏడేళ్ల క్రితం సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం కేసులో దోషులుగా తేలిన వినయ్ శర్మ, ముకేశ్ సింగ్, అక్షయ్ కుమార్, పవన్ గుప్తాలను జనవరి 22న ఉదయం ఏడు గంటలకు ఉరితీయాలని ఆదేశిస్తూ ఢిల్లీ కోర్టు ఇటీవల డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆలోగా దోషులు తమ న్యాయపరమైన అవకాశాలను వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో దోషులు ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సింగ్ జనవరి 9న తమకున్న చిట్ట చివరి అవకాశమైన క్యురేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
ఇక ఈ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో నిర్భయ దోషులకు ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్ష అమలు చేయనున్నారు. ఇప్పటికే జైలు అధికారులు ఉరికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. తలారిని కూడా సిద్ధం చేశారు. బీహార్ బక్సర్ నుంచి ఉరి తాళ్లను కూడా ప్రత్యేకంగా తెప్పించారు. మరోవైపు నిర్భయ తల్లిదండ్రులు సుప్రీం నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిర్భయ ఆత్మ శాంతిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో 2012 డిసెంబర్ 16న నిర్భయపై సామూహిక లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. కదులుతున్న బస్సులో ఆరుగురు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఆతర్వాత బాధితురాల్ని నడిరోడ్డుపై పడేశారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13రోజుల పాటు పోరాడిన నిర్భయ చివరకు ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి ఓ మైనర్ (17) సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారణలో ఉండగానే ప్రధాన నిందితుడైన రామ్సింగ్ 2013 మార్చి 11న తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ (17)కు జువెనైల్ జస్టిస్ బోర్డు మూడేండ్ల శిక్ష విధించి బాలనేరస్థుల పాఠశాలకు తరలించింది. అతడు 2015 డిసెంబర్ 20న విడుదలయ్యాడు. మిగతా నలుగురు.. ముకేశ్, వినయ్ శర్మ, పవన్, అక్షయ్ కుమార్ సింగ్ లను దోషులుగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది.
ఈ తీర్పు సవాల్ చేస్తూ దోషి అక్షయ్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అయితే, రివ్యూ పిటిషన్ ను గతేడాది డిసెంబర్ 18న సుప్రీం కోర్టు కొట్టేసింది. నలుగురు దోషులను ఉరి తీయాల్సిందేనని స్పష్టం చేసింది. ఇప్పటికే అన్ని విచారణలు పూర్తయినందున తీర్పును మరోసారి పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసం అభిప్రాయపడింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా దోషులు పెట్టుకున్న క్షమాబిక్ష పిటిషన్ను తిరస్కరించారు. అయితే, నిర్భయ దోషులకు శిక్ష అమలులో జాప్యంపై ఆమె తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లగా.. జనవరి 7న న్యాయస్థానం ఉరి శిక్ష తేదీలను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. నలుగురు నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది.