వరుసగా రెండోసారి భారీ విజయం
సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే ఆధిక్యం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ మరోసారి సొంతంగా అధికారం చేపట్టేందుకు కావల్సిన బలాన్ని సంపాదించింది. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మొదలైన రెండు గంటలకే ఎన్డీయే హవా స్పష్టంగా కనిపించింది. హిందీ బెల్టుగా చెప్పుకొనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సహా పలు రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు సాధించింది. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచినా, లోక్ సభ విషయంలో మాత్రం బీజేపీ మళ్లీ పైచేయి కనబర్చింది. తృటిలో అధికారం చేజారిన కర్ణాటకలో కూడా భారీ ఆధిక్యం సంపాదించింది. పంజాబ్ తో పాటు, డీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో తమిళనాడులో.. ఈ రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ కాస్త చెప్పుకోదగ్గ స్థానాలు పొందింది. స్వయంగా పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో ఓడిపోయారు. వయనాడ్ స్థానంలో గెలవడంతో కాస్త పరువు నిలిచింది. 543 స్థానాలకు గాను వెల్లూరు ఎన్నిక రద్దు కావడంతో 542 చోట్ల ఎన్నికలు నిర్వహించగా 272 స్థానాలొస్తే అధికారానికి సరిపోతాయి. బీజేపీకి సొంతంగా 303, ఎన్డీయేకు 351 స్థానాలు లభించాయి.
గత ఐదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ పాలనాయంత్రాంగంపై గట్టి పట్టు సాధించారు. విదేశీ విధానంలో బలంగా ఉన్నారు. స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా లాంటివాటిని బాగా ప్రోత్సహించారు. కానీ నిరుద్యోగం, ఆర్థిక మందగమనం తదితర విషయాల్లో ఆయనపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. అయినా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించిన ఆధిక్యంతో భాజపా మరోసారి అధికారంలోకి వచ్చింది. ప్రధానంగా జాతీయవాదం, జాతీయ భద్రత, అభివృద్ధి అనే మూడు అంశాలే ఇందుకు కారణం. కులం, మతం, వర్గాలు, ఆర్థిక గ్రూపులు.. ఇలాంటివన్నీ ఈ ఎన్నికలలో కీలక పాత్ర పోషించాయి. జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ప్రాంతంలో ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సైనికులు మరణించాక భావోద్వేగాలు బాగా పెరిగాయి. రాత్రికి రాత్రే బీజేపీ తన ప్రచారాన్ని జాతీయ భద్రత, జాతీయవాదం చుట్టూ అల్లుకునేలా మార్చింది. తర్వాత అభివృద్ధిని జోడించింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవసాయం, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ, రఫేల్ యుద్ధ విమానాల వివాదం చుట్టూ ప్రచారం చేసి, జాతీయ భద్రతను నిర్లక్ష్యం చేసింది.
ఇక ప్రచార పర్వంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తదితరులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వాటిని త్వరగా పరిష్కరించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈసీ ప్రధానికి క్లీన్ చిట్ ఇవ్వడంతో ప్రతిపక్షం తీవ్రంగా విమర్శించింది. బీజేపీకి ఈసీ పాదాక్రాంతమైందని మండిపడింది. కానీ ఇవేమీ ఎన్నికలలో పెద్దగా పనిచేయలేదు. అందుకు ఎన్నికల ఫలితలే నిదర్శనం. దేశంలోనే అత్యధిక సంఖ్యలో ఎంపీలను పంపే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మరోమారు తన ఆధిక్యం చూపింది. ఎస్పీ-బీఎస్పీ కూటమి తన ప్రభావాన్ని పెద్దగా చూపలేకపోయింది. కేంద్రంలో అధికారం రావాలంటే ఆ రాష్ట్రంలో ఆధిక్యం ఎవరికైనా తప్పనిసరి.
డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లను సొంతం చేసుకున్న కాంగ్రెస్.. ఈసారి చతికిలబడింది. తన సోదరి ప్రియాంకను కూడా క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకొచ్చినా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ప్రయోజనం సాధించలేదు. ఆమె ఇన్చార్జిగా ఉన్న తూర్పు ఉత్తరప్రదేశ్ లోనూ బీజేపీ ఆధిక్యం కనిపించింది. ఇక శివసేన, జేడీయూ, అప్నాదళ్ లాంటి పార్టీలను మళ్లీ ఎన్డీయే దరికి చేర్చడంలో అమిత్ షా కీలక పాత్ర పోషించారు. ఒకవైపు ఎన్డీయే ఇలా అందరినీ కలుపుకొని వెళ్తే, మరోవైపు ప్రతిపక్షం మాత్రం ముక్కలు చెక్కలైంది. అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి వాళ్లు రాష్ట్రస్థాయిలో పొత్తులకు అడ్డం పడ్డారు. దాంతో ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మంచి విజయాలు సాధించింది. యూపీలోనూ కాంగ్రెస్ ను పక్కన పెట్టాలన్న మాయావతి నిర్ణయం చాలా ఖరీదైందిగా మారింది. ఒకానొక సమయంలో ప్రధానమంత్రి అవ్వాలని కూడా మాయ భావించారు. బెంగాల్ సీఎం మమతకూ అలాంటి ఆసక్తే ఉంది. కానీ రాష్ట్రంలోని 42 స్థానాలకు గాను ఆమె కేవలం 23తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బెంగాల్, ఒడిశాలలోకి బీజేపీ ప్రవేశిస్తుందని ఎగ్జిట్ పోల్స్ ముందు నుంచి చెబుతున్నాయి. అయినా వాటిని ప్రతిపక్షం సీరియస్ గా తీసుకోలేదు. చివరకు అదే జరిగింది. తన సొంత బలం ఉన్న ప్రాంతాలతో పాటు కొత్త ప్రాంతాలకు కూడా బీజేపీ విస్తరించడంతో ఆ పార్టీ ముందెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో బలాన్ని పెంచుకోగలిగింది. ఈవీఎంల వివాదం, వీవీప్యాట్ చీటీలను లెక్కపెట్టాలనడం లాంటి వివాదాలను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.