(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పలు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంజన ఓ సెల్ఫీ వీడియో కారణంగా ఇబ్బందుల్లో పడింది. ప్రమాదకరంగా కారు నడుపుతూ సెల్ఫీ వీడియో తీసుకున్న నటి సంజనపై బెంగళూరు ట్రాఫిక్ పోలీస్లు సీరియస్ అయ్యారు. విచారణకు హాజరు కావాలంటూ ఆమెకు నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా చూసేందుకు సంజన వెళ్లింది. కారు డ్రైవ్ చేస్తూ… ఓ సెల్ఫీ వీడియో తీసుకుంది. దాన్ని సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇది కాస్తా బెంగుళూరు పోలీసుల దృష్టికి వెళ్లింది. సెల్ఫీ వీడియోపైనే పూర్తి దృష్టి పెట్టి డ్రైవింగ్ చేయడంపై బెంగళూరు ట్రాఫిక్ పోలీస్లు సీరియస్ అయ్యారు. దీంతో ఆమెను విచారణకు రావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడిన కారణంగా సంజనపై కేసు నమోదు చేసి ఆమెకు నోటీసులు పంపించారు.
నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన సెలబ్రిటీలు ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పెడితే వాటి వల్ల అభిమానులు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇలాంటి చర్యలు మానుకోండని మిగతా వారిని కూడా హెచ్చరిస్తున్నారు. సాధారణ వ్యక్తుల కంటే సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో బాధ్యత వ్యవహరించాలని వారు పోలీసులు కోరుతున్నారు.
గతేడాది సెప్టెంబర్ 1నుంచి దేశవ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ కఠినతరమైన సంగతి తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘిస్తే.. వారు వీరు అనే తేడా లేకుండా చలాన్లు వేస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం… డ్రైవింగ్ చేస్తూ మొబైల్ వాడటం నేరం. ఇందుకు రూ.1000 ఫైన్ వేస్తారు. రెండోసారి కూడా ఇలాగే మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే… డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. అలాగే రూ.1000 ఫైన్ వేస్తారు. ఒకవేళ మూడోసారీ పట్టుబడితే జరిమానా విధించడమే కాదు జైలుకు కూడా పంపించే అవకాశం ఉంది. నటి సంజన విషయంలో బెంగళూరు పోలీసులు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన నటి సంజన.. తరువాత సర్థార్ గబ్బర్సింగ్, దండుపాళ్యం లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం తమిళ సినిమాలతో బిజీ ఉన్న అమ్మడు బాక్సర్, పొడముండమ్ అనే సినిమాలు చేస్తుంది.
https://www.instagram.com/p/B7Ofgrjgsj_/?utm_source=ig_embed