హైదరాబాద్: టిఎస్ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తారన్న విపక్షాల ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆర్టీసీని కాపాడుకుంటాం కానీ ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారంతో విపక్షాలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తూ వారిని తప్పు దారి పట్టిస్తున్నాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో గానీ.. ఎన్నికల హామీల్లో గానీ ఏనాడు ఆర్టీసీ విలీనం గురించి చెప్పలేదన్నారు. పక్క రాష్ట్రం వాళ్లు చేసినంత మాత్రానా తెలంగాణలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన పనిలేదన్నారు. పక్కనోడు తొడ కోసుకున్నాడని మేము మెడ కోసుకోమని వ్యాఖ్యానించారు. ఇక్కడ అమలవుతున్న రైతు బంధు, రైతు భీమా అక్కడ అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు.
ఆర్టీసీ ఆస్తులను కాజేయాలని కుట్ర పన్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ప్రభుత్వంపై విపక్షాలు అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా అని ప్రశ్నించారు. దేశంలో రైల్వేనే ప్రైవేటీకరించిన బీజేపీ.. రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ ప్రభుత్వ విలీనంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా అని ప్రశ్నించారు.
దసరా పండుగ వేళ ప్రజలకు అసౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో ఒక అసమ్మతమైన సమ్మెను ప్రజలపై రుద్దాలని యూనియన్లు ప్రయత్నించాయని ఆరోపించారు. అయితే వారి చర్యలను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమర్థవంతంగా ఎదుర్కొంటోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ,ప్రైవేట్ బస్సులు అన్నీ కలుపుకుని 7358 బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ఆలోచనే లేదని మరోసారి స్పష్టం చేశారు. ఆర్టీసీ లాభాల్లో కొనసాగాలంటే.. 50శాతం ప్రభుత్వ బస్సులు,30శాతం హైరింగ్,20శాతం రూట్ పర్మిషన్ బస్సులను నడపాలని నిర్ణయించినట్టు తెలిపారు. అంతే తప్ప ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదన్నారు. ఆర్టీసీ ఉండాలని కేసీఆర్ ఇదివరకే స్పష్టం చేశారని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుచేశారు.