శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని బారముల్లా – ఉధంపూర్ రహదారిలో వారంలో రెండు రోజుల పాటు ప్రజల వాహనాలను అనుమతించకూడదన్న నిబంధన ఈ ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. పుల్వామా టెరరిస్టు దాడి దరిమిలా అలాంటి మరో దాడి జరగకుండా చూసే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని రాజకీయపార్టీలు, పౌర సంఘాలూ నిరసిస్తున్నాయి. దీని ఫలితంగా రోడ్ల కూడళ్లలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. తమను వెళ్లనివ్వాల్సిందిగా ప్రజలు పోలీసులను ప్రాధేయపడుతున్న దృశ్యాలు అనేకచోట్ల కనబడ్డాయి.
అత్యవసర కారణాలతో ప్రయాణం చేసేవారికి పాస్లు జారీ చేయడం కోసం రహదారి వెంట మెజిస్ట్రేట్లను నియమించినట్లు అధికారులు చెప్పారు. ప్రయాణం నిషేధం అమలు చేయడం కోసం రహదారి వెంట భారీగా పోలీసు బందోబస్తు నియమించారు. ప్రతి ఆదివారం, బుధవారం ఈ నిషేధం అమలులో ఉంటుంది.
భద్రతా కారణాలతో ప్రజలను ఇంత తీవ్రమైన కష్టాలలోకి నెట్టడమేమిటని పౌరసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ చర్యను జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుర్రలేని చర్యగా అభివర్ణించారు.