గుంటూరు: టిడిపి నేత కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిసాయి. నర్సరావుపేటలోని స్వర్గపురిలో వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు పల్నాటి పులి అమర్ రహే అంటూ నినాదాలు చేస్తుండగా కోడెల కుమారుడు శివరామకృష్ణ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ అంతిమ సంస్కారాలను నిర్వహించారు.
కోడెలను కడసారి చూసి నివాళులర్పించాలని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి అంతిమాయత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్రలో కోడెల భౌతికకాయం వెంట టిడిపి అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, నారా లోకేష్, మాజీ మంత్రులు, టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. నాలుగు కిలో మీటర్ల మేర కోడెల అంతిమయాత్ర సాగింది. పల్నాటి పులి అమర్ రహే, జోహార్ కోడెల అంటూ అభిమానులు అంతిమయాత్రలో నినాదాలు చేస్తూ ముందుకుసాగారు. నర్సరావుపేట పట్టణం జనసంద్రమైంది.
కోట సెంటర్, సత్తెనపల్లి రోడ్డు, వినాయక టెంపుల్, బరంపేట, టూటౌన్ పోలీస్ స్టేషన్ సెంటర్, పల్నాడు రోడ్డు, మల్లం సెంటర్, బలాబజార్ మీదుగా స్వర్ణపురికి అంతిమ యాత్ర చేరుకున్నది.
కోడెల అంత్యక్రియల సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో వ్యాపార వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్చందంగా మూసివేశారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు.