(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్నగర్ ఉపఎన్నిక సోమవారం(అక్టోబర్ 21) జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఇక్కడ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీ ఒక వైపు..ప్రతిపక్షాల వైపు ఒక వైపు అన్నట్టుగా ఈ ఎన్నిక మారింది. దీంతో..ఇది వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠకు పరీక్షగా మారుతోంది. హుజూర్నగర్ ఉప ఎన్నిక తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించినప్పటి నుంచి అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి నెల రోజులుగా ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం సాగించాయి. తమ కంచుకోటను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే… ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని… నాలుగేళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్నగర్లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేస్తుండడంతో ఈ సీటును ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు. దీంతో పోటీ ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్యే కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్నగర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్నప్పటికీ…. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే జరుగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్లందర్నీ ఏకం చేసింది హుజూర్నగర్ ఉపఎన్నిక. అన్ని విషయాల్లో వివాదాలకు ప్రాధాన్యతనిచ్చే నేతలు సైతం, బైపోల్స్లో జోరుగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీలో నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తే ఎలా ఉంటుందో హుజూర్ నగర్ ఉప ఎన్నికల క్యాంపెయిన్ చూస్తే అర్థమవుతుంది. ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థిని పీసీసీ చీఫ్ ఏకపక్షంగా నిర్ణయించడాన్ని విభేదించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం ప్రచారం నిర్వహించారు. ఎప్పుడూ పార్టీలో ఏ చిన్నతప్పు అనిపించినా నిర్మోహమాటంగా విమర్శలు చేసే విహెచ్, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని సొంతంగా ప్రచారం చేశారు. అయితే వీళ్లంతా ఏకం కావడానికి అభ్యర్ది పద్మావతి రెడ్డి చొరవే కారణమన్న చర్చ పార్టీలో జోరుగా వినిపిస్తోంది. దీనికి తోడు ఉప ఎన్నికను చావోరేవోగా కాంగ్రెస్ భావిస్తుండటంతో, గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. హుజూర్ నగర్లో గెలుస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉందని ప్రచారం చేసుకోవచ్చని భావిస్తున్నారు. హుజూర్నగర్ ఫలితంతో వచ్చే మున్నిపల్ ఎన్నికల్లోనూ పార్టీకి మాంచి ఊపు వస్తుందని నేతలు అభిప్రాయపడుతున్నారు. తమ మధ్య విభేదాలున్నా, లేకపోయినా పార్టీ కోసం సమైక్యంగా ముందుకు సాగుతున్నారు. మరి వీరి ఐక్యతారాగం ఏ మేరకు ఫలిస్తోందో చూడాలి.
మరోవైపు హుజూర్నగర్ ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రిస్టేజీ ఇష్యూగా మారింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలను ఈ పార్టీ కోల్పోయింది. దీంతో ఈ బై పోల్ లో హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఏడు వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన అనంతరం కేసీఆర్.. ప్రచార వ్యూహాన్ని రూపొందించారు. హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు ఆయన తన కేబినెట్ లోని సుమారు ఆరుగురు మంత్రులకు, మరికొందరికి కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కూడా అయిన కేటీఆర్.. ఈ నియోజకవర్గంలో ప్రచార సభలను, రోడ్ షోలను నిర్వహించారు. అయితే, వాతావరణం అనుకూలించక పోవడం, హుజూర్నగర్ లో భారీ వర్షం పడటంతో సీఎం కేసీఆర్ సభ రద్దైంది. దీంతో తొలిసారిగా కేసీఆర్ ప్రచారం లేకుండానే ఈ ఉపఎన్నిక జరగనుంది. హుజూర్ నగర్ ఉపఎన్నికలో సీపీఐ మొదట టీఆర్ఎస్ కి మద్దతు ప్రకటించినప్పటికీ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో వెనక్కి తీసుకుంది. దీంతో గులాబీ పార్టీ ఎప్పటిలాగే ఈసారి కూడా ఒంటరిగానే బరిలోకి దిగింది. అయితే, ఆర్టీసీ కార్మికుల సమ్మె తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె జురుగుతున్న వేళ… దీని ప్రభావం ఎన్నికలపై పడుతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్ వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో హుజూర్నగర్ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.