(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న హుజూర్నగర్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయాన్నే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నియోజవకర్గ పరిధిలోని ఏడు మండలాల్లో మొత్తం 302 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో ముగ్గురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 1,20,427 మంది మహిళలు, 1,16,415మంది పురుష ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. ప్రతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 3,350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఈ నెల 24న ఫలితాలు ప్రకటిస్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్నగర్ స్థానం నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. నల్గొండ ఎంపీగా ఎన్నిక కావడంతో హుజూర్నగర్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. బరిలో టీడీపీ, బీజేపీ కూడా ఉన్నప్పటికీ…. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే జరుగుతోంది. హుజూర్నగర్ ఉపఎన్నిక అధికార టీఆర్ఎస్ కు ప్రిస్టేజీ ఇష్యూగా మారింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెండు లోక్ సభ స్థానాలను ఈ పార్టీ కోల్పోయింది. దీంతో ఈ బై పోల్ లో హుజూర్ నగర్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గత ఏడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఏడు వేల ఓట్లతేడాతో ఓడిపోయారు.
తమ కంచుకోటను తిరిగి దక్కించుకుంటామని కాంగ్రెస్ చెబుతుంటే… ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. 40 ఏళ్లలో జరగని అభివృద్ధిని… నాలుగేళ్లలో చేసి చూపిస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ ఉపఎన్నికలో గెలుపును అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్నగర్లో ఎలాగైనా ఈసారి గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంది. సిట్టింగ్ స్థానం కాబట్టి ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె జురుగుతున్న వేళ… దీని ప్రభావం ఈ ఉప ఎన్నికలపై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకుంటుందా? హుజూర్నగర్ లో కారు దూసుకెళ్తుందా? తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే. మొత్తం మీద హుజూర్ నగర్ ప్రజాతీర్పు ఎలా ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.