హైదరాబాద్: అధికార టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మాజీ మంత్రులు పలువురు బాహాటంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని మాజీ హోంశాఖ మంత్రి నాయని నర్శింహరెడ్డి సోమవారం ముఖ్యమంత్రి కెసిఆర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కెసిఆర్ మాట తప్పారని అన్నారు. హోం మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తనకు ఆర్టిసి చైర్మన్ ఎందుకని నాయిని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముషీరాబాద్ టికెట్ అడిగితే ముఠా గోపాల్ను గెలిపించుకునిరా.. మంత్రి పదవి ఇస్తానని కెసిఆర్ చెప్పారని నాయిని అన్నారు.
టిఆర్ఎస్ పార్టీకి తామంతా ఓనర్లమేననీ, కెసిఆర్ తమ ఇంటి పెద్ద అని నాయిని వ్యాఖ్యానించారు. పార్టీలోకి కిరాయికి వచ్చిన వారు ఎప్పుడు దిగిపోతారో తెలియదని నాయని అన్నారు. మాజీ డిప్యూటి సిఎం, ఎమ్మెల్యే రాజయ్య కూడా పార్టీపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో 11 నుండి 12 శాతం మాదిగలున్నారని రాజయ్య పేర్కొన్నారు. క్యాబినెట్లో మాత్రం మాదిగలు ఒక్కరు కూడా లేరని తన అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో మాదిగలు, ఏపిలో మాలలున్నారని తెలిపారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాల్సిన అవసర ఉందన్నారు. విపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని రాజయ్య అన్నారు. ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ ఆవరణలో విలేఖరులతో చిట్చాట్గా ఈ విషయాలను వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితం మంత్రి ఈటెల రాజేందర్ కూడా టిఆర్ఎస్ పార్టీ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గులాబీ జెండాకు తామంతా ఓనర్లం అంటూ ఈటెల చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఇదే మాదిరిగా నాయిని కూడా నేడు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయిన సీనియర్ ఎమ్మెల్యేలకు పలు కార్పోరేషన్ చైర్మన్ పదవులు అప్పగించాలని సిఎం కెసిఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని కెసిఆర్ ఆలోచన చేసినప్పటికీ ప్రస్తుత రాష్ట్రంలో రాజకీయాలు, టిఆర్ఎస్లో అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.