హైదరాబాద్: తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసుపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. తహశీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడు సురేష్ టీఆర్ఎస్ కార్యకర్త అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి స్పందించారు. తహసీల్దార్ హత్య విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం ఉందని కాంగ్రెస్ నేత మల్రెడ్డి రంగారెడ్డి చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఖండించారు. తనపై బురదజల్లి రాజకీయంగా లబ్ది పొందాలనే ఉద్దేశంతో మల్రెడ్డి రంగారెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. భూకబ్జాదారుడు ఎవరనేది నిరూపించేందుకు తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పారు. మల్రెడ్డి రంగారెడ్డి మూడుసార్లు ఓడిపోయిన ఫ్రస్టేషన్లో ఉన్నారని విమర్శించారు. విజయారెడ్డి హత్య కేసులో నిందితుడైన సురేష్ తమ పార్టీ పార్టీ కార్యకర్త కాదని మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందే అతడు కాంగ్రెస్లోకి వెళ్లాడని చెప్పారు. తహసీల్దార్ ను హత్య చేసిన నిందితుడు సురేష్ తండ్రి నుంచి.. మల్రెడ్డి కుటుంబీకులు భూములు కొన్నారని మంచిరెడ్డి ఆరోపించారు. ఈ భూములన్నింటిపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఆరు నెలల కిందట భూ వివాదంలో గౌరెల్లి గ్రామస్థులు తన దగ్గరకు వచ్చారని… 60 మంది రైతులతో కలిసి తాను జాయింట్ కలెక్టర్ను కలిశానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వివరించారు. భూకబ్జా చేసింది మల్రెడ్డి రంగారెడ్డి బంధువులేనని ఆరోపించారు. బాచారంలోని సర్వే నం.70 నుంచి 101 వరకు ఉన్న 412 ఎకరాల భూముల్లో మల్రెడ్డి కుటుంబం కబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. సరైన డాక్యుమెంట్స్ లేకుండానే రైతులను భయభ్రాంతులకు గురిచేసి భూములు లాక్కున్నారని ఆరోపించారు. పాస్బుక్స్ లేకపోయినా పహాణీలతోనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా సీఎస్,డీజీపీలకు లేఖలు రాస్తున్నానని తెలిపారు. మల్రెడ్డికి అతని తండ్రి ద్వారా సంక్రమించింది కేవలం రెండెకరాలు అని.. ఇప్పుడు ఇంత స్థాయిలో భూములు సంపాదించేందుకు సంపాదన ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు.