హైదరాబాద్: ఏపీ శాసనమండలి రద్దు నిర్ణయం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. పెద్దల సభ ఎంతో అవసరమని, మండలి ఖర్చు వృథా వ్యయం అనడం నాన్సెన్స్ అని వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడారు. కౌన్సిల్ పెద్దల సభగా కొనసాగాలాని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో ఎన్టీఆర్ హయాంలో శాసన మండలిని రద్దుచేస్తే తాను స్వయంగా ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినట్లు గుర్తు చేశారు. అంతేకాదు ఏపీ ముఖ్యమంత్రి మండల నిర్వహణపై చేసిన వ్యాఖ్యలను సైతం ఆయన తప్పుపట్టారు. మండలి వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టమనడం నాన్సెన్స్ అని కేకే అన్నారు. ప్రభుత్వాన్ని నడిపే క్రమంలో అదేమీ పెద్ద ఖర్చు కాదని కేకే అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో రెండో అభిప్రాయం తప్పని సారి అని చెప్పారు. ఎవరైనా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని సరిచేసేందుకు పెద్దలు సరిచేస్తారని ఆయన సూచించారు. శాసన సభ నిర్వహణా వ్యయంలో కేవలం మూడు శాతం వ్యవయంతోనే మండలి నడపవచ్చని కేకే చెప్పారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన తీర్మానాలను కేంద్రం అమలు చేస్తుందని చెప్పారు. అవసరమైతే అమలుకు ఎక్కువ సమయం తీసుకోవచ్చని కేకే తెలిపారు.