సూర్యాపేట: ఉత్కంఠ రేపిన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎక్స్అఫిషియో ఓట్లతో చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. చైర్మన్గా చందమల్ల జయబాబు, వైస్ చైర్మన్గా చల్లా శ్రీలత ఎన్నికయ్యారు. సోమవారం(జనవరి 27) వరకూ టీఆర్ఎస్, కాంగ్రెస్ బలాబలాలు సమానంగా ఉండగా.. మంగళవారం ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డికి ఎక్స్ అఫిషియో ఓటును ఇవ్వడంతో టీఆర్ఎస్ బలం 11కి.. ఉత్తమ్, కేవీపీతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. దీంతో నేరేడుచర్ల మునిసిపల్ చైర్మన్ టీఆర్ఎస్ ఖాతాలో పడిపోయినట్లైంది.
అయితే సుభాష్రెడ్డికి అవకాశం కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓటింగ్ ప్రారంభమయ్యాక ఓటు హక్కు కల్పించడమేమిటని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం రోజు కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇరు పార్టీల బలాలు సమానంగా ఉండటంతో.. తొలుత డ్రా తీస్తారని అంతా భావించారు. కానీ మంగళవారం ఆసక్తికర పరిణామాల చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని కూడా లిస్టులో చేర్చడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసింది. సోమవారం ఇచ్చిన జాబితా ప్రకారమే ఎన్నిక జరపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నిక జరగాలంటూ.. మరికొందరు కాంగ్రెస్ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
టీఆర్ఎస్ గెలిచిన సీట్లన్నీ అక్రమంగా గెలిచారంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సోమవారం లిస్టులో లేని శేరి సుభాష్ రెడ్డి ఓటును ఎలా చేరుస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
మరోవైపు నేరేడుచర్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సూర్యాపేట జిల్లా కలెక్టర్కు ఎసరుపెట్టింది. రాజ్యసభ సభ్యులు కేవీపీకి ఓటు వేసే అవకాశం ఇచ్చినా అమలు కాకపోవడంపై ఈసీ సీరియస్ అయ్యింది. జిల్లా కలెక్టర్పై బదిలీ వేటు వేసింది.