(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల వర్షం కురిపించడం వెనుక ఆంతర్యం ఏంటి ? కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేస్తే అసలు పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడు వరాల మీద వరాలు కురిపించింది. సమ్మె కాలానికి జీతం, కార్మికులకు ఉద్యోగ భద్రత, ప్రతి ఏడాది బడ్జెట్ లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు ఆర్థిక సాయం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వరాలు ప్రకటించారు సీఎం కేసీఆర్.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు మరో 26 డిమాండ్ల కోసం కార్మికులు సమ్మె బాటపట్టారు. ఈ సమ్మెకాలంలో 30 మందికిపైగా కార్మికులు చనిపోయారు. అప్పుడు కూడా సీఎం స్పందించలేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. అయినా ప్రభుత్వం వారిపై ఎదురు దాడి దిగింది. కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని, ‘డెడ్ లైన్ లోపు విధుల్లో చేరని కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారు’ లాంటి ప్రకటనలు కూడా ప్రభుత్వం చేసింది. అంతేకాదు ఆర్టీసీలో 5,100 బస్సులకు ప్రైవేట్ రూట్ పర్మిట్లు ఇస్తూ కేసీఆర్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంత కఠినంగా వ్యవహరించిన సీఎం కేసీఆర్… ఇప్పుడు సడన్ గా యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు ? అన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. ‘కార్మికులకు జీతాలు చెల్లించేందుకు కూడా సంస్థ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడున్న స్థితిలో ఆర్టీసీని నడపటం సాధ్యం కాదన్న ప్రభుత్వం’.. ఆర్టీసీకి తక్షణ సహాయం కింద రూ.100 కోట్లు ఎలా మంజూరు చేసింది ? ప్రతి ఏటా వెయ్యి కోట్లు ఇస్తామని ఎందుకు ప్రకటించింది అన్నది ? సామాన్యుడి ప్రశ్న.
నిజానికి ఆర్టీసీ కార్మికులు చేసిన డిమాండ్లలో కొన్నింటిని కేసీఆర్ ఆదివారం(డిసెంబర్ 1) జరిగిన ఆత్మీయ సమావేశంలో ప్రకటించారు. కార్మికులు సమ్మె చేసినప్పుడు ఈ డిమాండ్లను అంగీకరించి ఉంటే అసలు సమస్యే ఉండేది కాదు కదా! అని సామాన్యు ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. అటు ప్రభుత్వం బానే ఉంది. ఇటు ఇన్నాళ్లు సమ్మె చేసిన ఆర్టీసీ ఉద్యోగులు కూడా బాగానే ఉన్నారు. మధ్యలో సామాన్య జనమే నలిగిపోయారు. దసరా లాంటి పెద్ద పండగ సమయంలో కార్మికులు సమ్మెకు దిగడంతో ప్రభుత్వంతోపాటు సామాన్య ప్రజలు కూడా వారిపై విమర్శలు చేశారు. రోజురోజుకి సమ్మె తీవ్రం కావడం, ప్రభుత్వం కఠినంగా ఉండడంతో కార్మికులపై ప్రజల్లో సానుభూతి పెరిగింది. ‘అయ్యో పాపం వీళ్ల ఉద్యోగాలు ఉంటాయో పోతాయో’ అని చాలా మంది బాధపడ్డారు. అనంతరం పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. కార్మికులను వీధుల్లో తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీని కాపాడుకుంటామని చెప్పింది. ఇదే సమయంలో ఆర్టీసీ టికెట్లపై ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దసరా పండక్కి బస్సులు లేనప్పుడు జనం జేబుకు పెద్ద చిల్లు పడింది. ఆర్టీసీ బస్సులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు సమస్య పరిష్కారం అయినా కూడా చార్జీల భారం మళ్లీ తిరిగి జనంపైనే పడింది. దాదాపు రెండు నెలల తర్వాత కార్మికులకు సెప్టెంబర్ నెల జీతాలు పడ్డాయి. ఇన్నాళ్లు కఠినంగా కనిపించిన సీఎం ఇంత సడన్ గా మెత్తబడ్డారు. అంటే ఇక్కడ జనమే పిచ్చి వాళ్లు అయ్యారు. మొత్తం మీద ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు సంతోషంగా ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం ఆర్టీసీ ఛార్జీల భారంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది.