(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. అన్ని సర్వీసులపై కిలోమీటర్కు 20 పైసల చొప్పున పెంచారు. కనీస చార్జీని రూ.10కి ఖరారు చేశారు. పెద్ద మొత్తంలో పెంచిన చార్జీలు సోమవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చేశాయి. పల్లె వెలుగు నుంచి గరుడ ప్లస్ వరకూ అన్ని బస్సుల్లోనూ చార్జీలు పెరిగాయి. కనీస చార్జీల్లో మార్పుచేయడంతోపాటు పెరిగిన చార్జీలకు అనుగుణంగా బస్పాసుల చార్జీల్లోనూ మార్పుచేసినట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. సాధారణ ప్రయాణికులకోసం ఇచ్చే కాంబో టికెట్ల చార్జీలను పెంచినట్లు తెలిపింది. టోల్ప్లాజా టారిఫ్, ప్యాసింజర్ సెస్, ఎమినిటీస్, ఏసీ సర్వీసులపై జీఎస్టీ తదితర చార్జీలు అదనమని పేర్కొన్నది. వాస్తవానికి డిసెంబర్ 2వ తేదీ నుంచే ఛార్జీల పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటికీ… టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒకరోజు సమయం పట్టే అవకాశం ఉండటంతో… ఛార్జీల పెంపును అధికారులు ఒకరోజు వాయిదా వేశారు. ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి రూ. 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ చార్జీల పెంపు ఇది రెండోసారి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సుల్లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులపై ఇప్పుడు ఛార్జీ భారం వడ్డించారు. సమ్మె సమయంలో కార్మికుల తీరుపై నిప్పులు చెరిగిన సీఎం కేసీఆర్.. వాళ్లు సమ్మె విరమించడంతో.. వారికి విందు భోజనం పెట్టి మరీ వరాలు కురిపించారు. అయితే సంస్థను లాభాల్లో పెట్టాలంటే ఛార్జీలు పెంచక తప్పదని.. ప్రయాణికులపై బాంబ్ పేల్చారు. సీఎం ఆదేశాలతో ఆర్టీసీ యాజమాన్యం ఛార్జీలు పెంచేసింది. అర్థరాత్రి నుంచే పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి.
ప్రతి బస్సు టికెట్పై కిలోమీటర్కి 20 పైసలు ఛార్జీ పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన 100 కిలోమీటర్లు ప్రయాణించేవారికి.. అదనంగా 20 రూపాయల భారం తప్పదు. పల్లెవెలుగులో కనీస ఛార్జీ 5 నుంచి 10 రూపాయలకు.. సెమీ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జీ 10 రూపాయలు.. ఎక్స్ప్రెస్ బస్సులో 10 నుంచి 15 రూపాయలు.. సూపర్ లగ్జరీలో కనీస ఛార్జీ పాతిక రూపాయలకు చేరింది. రాజధాని, వజ్ర, గరుడ, గరుడ ప్లస్ అన్ని బస్సుల ఛార్జీ కనీసం 35 రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్లో కనీస ఛార్జీ 75 రూపాయలుగా నిర్ణయించారు.
ఇక టికెట్తో పాటు.. అన్ని రకాల బస్పాస్ల ఛార్జీలు కూడా పెరిగాయి. సిటీ ఆర్డినరీ పాస్ 770 నుంచి 950 రూపాయలు, మెట్రోపాస్ 880 నుంచి 1070 రూపాయలకు పెంచారు. మెట్రో డీలక్స్ పాస్ 990 రూపాయల నుంచి 1180 రూపాయలకు, స్టూడెంట్ బస్పాస్ 130 నుంచి 165 రూపాయలకు పెంచుతూ ఆర్టీసీ నిర్ణయించుకుంది.