హైదరాబాద్: నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. వివిధ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నేతలతో చర్చల అనంతరం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. విలీనం డిమాండ్ను తాత్కాలికంగా పక్కన పెట్టామని, మిగిలిన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం చర్చించాలని ప్రభుత్వాన్ని అశ్వత్థామ రెడ్డి కోరారు. లేదంటే తమ నిరవధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వానిదే బాధ్యతని పేర్కొన్నారు. పోలీసులు మఫ్టీలో వచ్చి జేఏసీ నేతల్ని అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని అరెస్టులు జరగలేదన్నారు. కోర్టుతో పాటు ప్రజలను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టించదని ఆరోపించారు. కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యంగా ఉండాలని కోరారు.
ఆర్టీసీని రక్షించాలంటూ శుక్రవారం అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని, ఈ నెల 16న ఇందిరాపార్క్ వద్ద జేఏసీ నేతలు దీక్ష చేస్తారని తెలిపారు. అలాగే ఈ నెల 17, 18 తేదీల్లో అన్ని డిపోల వద్ద నిరసన దీక్షలు.. 19న హైదరాబాద్ నుంచి కోదాడ వరకు సడక్ బంద్ నిర్వహిస్తామని చెప్పారు. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులతో గవర్నర్ని కలుస్తామని, ఎన్హెచ్ఆర్సీ అపాయింట్మెంట్ కోరామని అశ్వత్థామరెడ్డి తెలిపారు.