(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
హైదరాబాద్: తెలంగాణలో 48 రోజులగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు కీలక ప్రకటన చేశారు. సమ్మెను విరమిస్తున్నామని.. తమను భేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. బుధవారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో హైకోర్టు తీర్పు, సమ్మె కొనసాగింపుపై జేఏసీ నేతలు కీలక చర్చలు జరిపారు. అనంతరం సమ్మె విరమించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని, లేబర్ కోర్డులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి వెల్లడించారు. కోర్టు తీర్పును ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం కూడా గౌరవించాలని సూచించారు. ఆర్టీసీ కార్మికుల ఆత్మగౌరవం నిలబడేలా, ప్రశాంత వాతావరణం కల్పించాలని కోరారు. విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని అన్నారు. భేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, యాజమాన్యం ఆ దిశగా సత్వరమే చర్య తీసుకుంటాయని ఆశిస్తున్నామని చెప్పారు. కార్మికులు డ్యూటీ చార్ట్ల మీద మాత్రమే సంతకాలు పెడతారని.. అది తప్ప ఇక ఎలాంటి షరతులపైనా సంతకాలు పెట్టరని స్పష్టం చేశారు.
మరోవైపు రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది. ఆర్టీసీ కార్మికులు గత 48 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంతోపాటు 26 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్ 5 వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. అప్పటి నుంచి తెలంగాణలో బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీకి భారీ నష్టం వచ్చింది.
అయితే, కార్మికులు వీధుల్లో చేరాలని నవంబర్ 5 తేదీ వరకు సీఎం కేసీఆర్ కార్మికులకు డెడ్ లైన్ పెట్టారు. కానీ, కార్మికులు సమ్మెను విరమించలేదు. దీంతో ప్రభుత్వం 5,100 రూట్లలో ప్రైవేట్ బస్సులను తిప్పాలని తెలంగాణ కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. రోజులు తరబడి సమ్మె చేస్తున్న ప్రభుత్వం స్పందించ లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేది లేదని భీష్మించుకొని కూర్చుంది. దీంతో ఆర్టీసీ కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందారు. కుటుంబ పోషణ కూడా భారంగా మారిపోయింది. మనోవేదనకు గురై గుండెపోటుతో కొంతమంది మృతి చెందితే మరికొంతమంది ఆత్మ బలిదానాలు చేసకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇటీవల ఓ మెట్టు దిగితూ ప్రకటన చేసింది. విలీనం డిమాండ్ను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని.. ప్రభుత్వం చర్చలకు పిలవాలని కోరింది. అయినప్పటికీ ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరపలేమని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. దీంతో, 48 రోజుల తరువాత సమ్మెను విరమించాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది. అయితే, ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకోవాలని కోరింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.