అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. టిటిడి డైరెక్టర్ల సంఖ్యను 19 మంది 25 మందికి పెంచుతున్నారు.ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గవర్నర్ ఆమోదానికి పంపింది. ఆయన ఆమోదం లభించిన వెంటనే సభ్యుల నియామక ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామకంపై పాలకమండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయి చర్చించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే పాలకమండలి సభ్యుల జాబితా ఖరారు అయ్యిందని తెలుస్తోంది. గవర్నర్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నారని సమాచారం. ఈ సారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. ఖరారు చేసిన పాలకమండలి సభ్యుల పేర్లను ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా వెల్లడించనున్నారనీ, ఆ వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారనీ తెలుస్తోంది.