తిరుపతి: ఎస్వీబీసీ ఛానెల్లో పనిచేసే ఓ మహిళా ఉద్యోగినితో చైర్మన్ పృధ్వీ ఫోన్లో సాగించిన సంభాషణ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆడియోటేపు వ్యవహారంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఆడియో టేపు వ్యవహారంపై పృధ్వీతో కూడా ఆయన మాట్లాడారు. అంతేకాదు దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆదేశించారు. వాస్తవమేనని తేలితే.. సీఎంతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆడియో టేపు విషయం గురించి తెలిసిన వెంటనే పృధ్వీతో మాట్లాడానని చెప్పారు. ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదని, తనను అవమానించేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారని చెప్పాడని అన్నారు. తన గొంతును ఎవరో అనుకరించిరనట్టు ఆ వీడియోలో తెలుస్తోందని పృథ్వీ పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై విచారణకు విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించానని, నివేదిక అందిన తర్వాత సీఎంకు తెలియజేస్తామని చెప్పారు. తప్పులు జరిగితే ఉపేక్షించేది లేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఓ మహిళా ఉద్యోగినితో ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ అసభ్యకరంగా మాట్లాడాడంటూ.. ఓ ఫోన్ కాల్ రికార్డింగ్ వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పృథ్వీ కూడా స్పందించారు. తాను ఏ ఉద్యోగినితో ఫోన్లో మాట్లాడలేదని.. ఆ ఆడియోలో ఉన్న వాయిస్ కూడా తనది కాదన్నారు. తాను ఎస్వీబీసీ చైర్మన్ అవ్వడం చాలామందికి ఇష్టం లేదని, అందుకే కావాలని ఇలాంటి వివాదాల్లోకి ఇరికిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ కాల్ వివాదంపై విచారణకు సిద్దమేన అని, తప్పుచేశానని తేలితే ఎటువంటి శిక్ష వేసినా శిరసావహిస్తానన్నారు.
మరోవైపు హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పుణ్య స్థలం తిరుమలలో అరాచక శక్తులు ప్రవేశించాయని టీటీడీ మాజీ సభ్యుడు ఎవి రమణ ఆరోపించారు. ఒక కుట్ర ప్రకారం తిరుమలని అపవిత్రం చెయ్యాలని కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తుందన్నారు. టీటీడీ వేదికగా నీచమైన పనులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల ప్రతిష్ట దిగజారే నిర్ణయాలే కాకుండా ఇప్పుడు ఏకంగా టీటీడీ వసతి గృహాలను ఎస్వీబిసి ఛైర్మెన్ తన రాస క్రీడలకు అడ్డాగా మార్చుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలని అపవిత్రం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాల్లో మార్పు లేకపోతే భక్తకోటి ఆగ్రహానికి గురికాక తప్పదని ఎవి రమణ హెచ్చరించారు.
ఇదిఇలా ఉంటే.. ఈ వ్యవహారంపై ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం కూడా తీవ్రంగా మండిపడింది. తక్షణం పృధ్వీని ఆ పదవి నుంచి తొలగించాలని సంఘం నేతలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.