(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి సంబంధించిన కొన్ని కీలకమైన ఆర్జిత సేవలు రద్దుకు పాలవర్గం నిర్ణయం తీసుకోనున్నది. బింబ పరిరక్షణకు వసంతోత్సవాలు, విశేష పూజ, కలశాభిషేకం సేవలు రద్దు చేయాలని ఇప్పటికే ఆగమ సలహా మండలి సూచించింది. ఈ నేపథ్యంలో శనివారం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదించనున్నారు. ఈ సమావేశంలో 90కిపైగా ఎజండాలోని అంశాలపై చర్చించి నిర్ణయాలను తీసుకోనున్నారు.
ప్రధానంగా పలు ఆర్జిత సేవల రద్దుతో పాటు ఆంగ్ల నూతన సంవత్సర వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, దర్శనాలపై పాలకమండలి చర్చించనున్నది. విశాఖకు చెందిన శ్రీదేవి క్యాటరింగ్కు రెండేళ్ల పాటు శ్రీవారి అన్న ప్రసాదాల కేంద్రాల నిర్వహణ బాధ్యత అప్పగించే అంశం, వరాహస్వామి ఆలయంకు బంగారు తాపడం చేయించేందుకు 14 కోట్ల రూపాయలు ఖర్చు చేసే అంశం, ఏడాదిగా ఖాళీగా ఉన్న టిటిడి హాస్పటల్ డైరెక్టర్ పోస్టు భర్తీ అంశం, టిటిడి కాంట్రాక్ట్ సొసైటిల కాలపరిమితి మరో రెండేళ్లపాటు పొడిగింపునకు, తిరుపతి అలిపిరి సమీపంలో యాత్రికుల సముదాయాన్ని నిర్మించే అంశం, అదే విధంగా మరో మూడు నెలల పాటు సొనా మసూరి బియ్యం సరఫరా చేసేందుకు రెండు రాష్ట్రాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా బియ్యం కొనుకోలుకు పాలకమండలి చర్చించి ఆమోదించనుంది. టిటిడిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణను మరో రెండేళ్ల పాటు పొడిగింపు, టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల మంజూరు, మరో ఏడాదికి సరిపరే పప్పు, నెయ్యి కొనుగోళ్లు తదితర అంశాలకు పాలకమండలి ఆమోదం తెలుపనుంది.