(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
తిరుపతి: ప్రధాని నరేంద్ర మోది ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టిటిడి ఆమోదం తెలిపింది. టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ సుబ్బారెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. వారణాసితో పాటు జమ్ముకశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి కూడా పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు.ఆర్జిత సేవల్లో ఎటువంటి మార్పులు పై చర్చ జరగలేదని తెలిపారు.
శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వార్త రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక పై వంద కోట్ల పరువు నష్టం దావా వేయాలని నిర్ణయించినట్లు చైర్మన్ తెలిపారు.
పాలకమండలి నిర్ణయాలు
- శ్రీవరహస్వామి ఆలయంలో గోపుర బంగారు తాపడానికి 14 కోట్ల రూపాయల కేటాయింపు
- తిరుమల ఘాట్ రోడ్డు మరమ్మత్తులకు 8 కోట్ల రూపాయలు కేటాయింపు
- సైబర్ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు ఆమోదం
- గౌరవ ప్రధాన అర్చకుడుగా రమణదీక్షులు నియామకం
- తిరుమల బర్డ్ ఆసుపత్రి డైరెక్టర్గా మదన్మోహనరెడ్డి నియామకం
- వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం
- తిరుపతిలోని కళ్యాణ మండపాల్లో ఏసి ఏర్పాటుకు 3.4 కోట్ల రూపాయలు కేటాయింపు
- పరిపాలనా భవనం మరమ్మతులకు 14.5 కోట్ల రూపాయలు కేటాయింపు
- ముంబాయిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు కేటాయింపు