హైదరాబాద్: టివి 9 మాజీ సిఇఒ రవిప్రకాష్, సినీనటుడు శివాజీల మధ్య జరిగిన ఫేక్ లావాదేవీలకు సంబంధించి కీలక అధారాలను పోలీసులు కనుగొన్నట్లు తెలుస్తోంది. పోలీస్ విచారణకు హజరుకాకుండా పరారీలో ఉన్న వీరిపై మరింత ఉచ్చు బిగించే పనిలో భాగంగా పోలీసులు వారి ఈ మెయిల్స్ తనిఖీ చేసినట్లు సమాచారం.
ఈ మెయిల్స్ తనిఖీలో రవిప్రకాష్, శివాజీ మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదనీ, ఎన్సిఎల్టిలో కేసు వేయడం కోసం, పాత తేదీతో నకిలీ షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.
ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాష్, రవిప్రకాష్కు సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఎబిసిఎల్ ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తి అనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ-మెయిల్స్ ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాశ్, ఆయన అనుచరులు తొలగించినప్పటికీ సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానం ఉపయోగించి వీటిని వెలికి తీసినట్లు తెలుస్తోంది.
రవిప్రకాష్ నుంచి 40 వేల షేర్లను కొనుగోలు చేసేందుకు శివాజీ 2018 ఫిబ్రవరి 20న ఒప్పందం కుదుర్చుకున్నట్లు సృష్టించిన ఒప్పందపు డ్రాఫ్ట్ను వాస్తవానికి 2019 ఏప్రిల్13న తయారు చేసినట్లు గుర్తించారు. ఈ డ్రాఫ్ట్ను ఆ రోజు సాయంత్రం 5:46 గంటలకు ఫైనాన్స్ అధికారి మూర్తికి మెయిల్ చేసిన శక్తి. రవిప్రకాశ్, ఎంవీకేఎన్ మూర్తి, రవిప్రకాశ్ సన్నిహితుడు హరిలకూ కాపీలు పంపినట్లు సమాచారం. 2018 ఫిబ్రవరి 20న కుదుర్చుకున్నట్లు పాత తేదీతో చేసుకోబోయే ఒప్పందం వివరాలు ఇందులో ఉన్నాయి.
వీరందరి మధ్య మెయిల్స్ సర్క్యులేట్ అయినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
ఇక శివాజీ ఎన్సిఎల్టిలో దాఖలు చేయడానికి అవసరమైన పిటిషన్ను విజయవాడకు చెందిన ఒక న్యాయవాది రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
2019 ఏప్రిల్ 14న ఆ పిటిషన్ కాపీని, అందులో చేయాల్సిన మార్పులను ఈ మెయిల్లో ప్రస్తావించడంతో పాటు, తగిన మార్పులు చేర్పులతో ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ అడ్వొకేట్కు పంపించాల్సి ఉంటుందంటూ రవిప్రకాష్, ఆయన అనుచరులకు శక్తి మెయిల్ పంపించిన సందేశాలూ పోలీసులకు లభించాయి. అదే రోజు ఈ పిటిషన్పై రవిప్రకాష్ ఆయన అనుచరులు మెయిల్లో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
వీటి ఆధారంగానే సెక్షన్ 41 సిఆర్పిసి కింద పోలీసులు రవిప్రకాశ్కు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఎన్సిఎల్టిలో జరగబోయే విచారణపై ఇప్పుడు సర్వత్రా
ఉత్కంఠత కొనసాగుతోంది.