సౌదీలో ఇద్దరు పంజాబీలకు శిక్ష అమలు
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరికి సౌదీ అరేబియాలో తల నరికి మరణశిక్ష అమలుచేశారు. ఈ విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్ధరించింది. హొషియార్ పూర్ కు చెందిన సత్వీందర్ కౌర్, లూధియానాకు చెందిన హర్జీత్ సింగ్ ఇద్దరికీ ఫిబ్రవరి 28నే మరణశిక్ష అమలుచేసిన, ఆ విషయాన్ని ముందుగా భారత రాయబార కార్యాలయానికి తెలియజేయలేదు. ఇది చాలా అమానుషం, అమానవీయమని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. ఈ శిక్షను నిరోధించలేనందుకు విదేశాంగ శాఖను ఆయన తప్పుబట్టారు. ఇద్దరి తల నరికివేత విషయాన్ని బయట పెట్టలేదని, సత్వీందర్ భార్య పిటిషన్ ద్వారా కోరితే తప్ప స్పందించలేదని అన్నారు. ఈ కేసులో మరిన్ని వివరాల కోసం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ను తాను సంప్రదిస్తానన్నారు.
సౌదీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం మరణశిక్ష పడిన ఇద్దరికి సంబంధించి డెత్ సర్టిఫికెట్లు మాత్రమే ఇస్తారు గానీ మృతదేహాలు కూడా ఇవ్వరని సత్వీందర్ భార్య సీమారాణికి విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. మార్చి 2వ తేదీన సౌదీ అరేబియా నుంచి ఎవరో ఫోన్ చేసి సత్వీందర్ కుటుంబ సభ్యులకు అతడికి పడిన శిక్ష గురించి చెప్పారు. అధికారికంగా నిర్ధారణ ఏమీ లేకపోవడంతో సీమారాణి విదేశాంగ శాఖను సంప్రదించారు. సరైన సమాధానాలు రాకపోవడంతో పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సత్వీందర్ కు మరణశిక్ష పడిందో లేదో నిర్ధరించాలని కోర్టు కేంద్రాన్ని ఏప్రిల్ 8న ఆదేశించింది. దాంతో ఎట్టకేలకు సీమారాణికి విదేశాంగ శాఖ నుంచి లేఖ అందింది.
సత్వీందర్, హర్జీత్ ఇద్దరికీ ఫిబ్రవరి 28న మరణశిక్ష అమలుచేసినట్లు రియాద్ లోని తమ రాయబార కార్యాలయానికి అదే రోజు లేఖ అందిందని కాన్సులర్ డైరెక్టర్ ప్రకాష్ చంద్ తెలిపారు. అయితే ఈ విషయాన్ని వారు తమకు ముందుగా చెప్పలేదన్నారు. మృతదేహాల అప్పగింత గురించి కూడా తాము సమాచారం కోరినా, ఇంతవరకు సమాధానం లేదని, దాంతో మార్చి 14న మరోసారి వారికి రిమైండర్ పంపామని చెప్పారు. ఆరిఫ్ ఇమాముద్దీన్ అనే సహ భారతీయుడిని చంపిన కేసులో సత్వీందర్, హర్జీత్ ఇద్దరినీ 2015 డిసెంబరు 9న అరెస్టుచేశారు.