అమరావతి: రాజధాని తరలింపుపై గత తొమ్మిది రోజులుగా రైతులు చేస్తున్న ఆందోళన తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో ఈ నెల 27న కేబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ప్యాకేజీ పెంచడం ద్వారా వారి ఆందోళనకు చెక్ పెట్టాలని ప్రభుత్వ యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి నుండి రాజధానిని తరలించవద్దంటూ గ్రామాల వారీగా రోజుకో రూపంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సచివాలయానికి వెళ్లే మార్గంలో మందడం, తుళ్లూరు, రాయపూడి తదితర ప్రాంతాల్లో అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధుల వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నిరసనల క్రమంలో కొద్ది రోజులుగా పోలీసులు, రైతుల మధ్య వాదోపవాదాలు, తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఈ నెల 27వ తేదీన అమరావతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలో కేబినెట్ భేటీ జరపాలని తొలుత భావించినా ముందుగా వెలగపూడి సచివాలయంలోనే నిర్దేశించినందున ఇక్కడే నిర్వహిస్తున్నారు.దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సచివాలయ ప్రధాన రహదార్లలో అణువణువు నిశితంగా పరిశీలిస్తున్నారు. కేబినెట్ సమావేశానికి ముఖ్యమంత్రితో పాటు ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు వస్తున్నందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిషేధాజ్ఞలు అమల్లోకి ఉన్నాయి. దీంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేబినెట్ సమావేశంలో రాజధాని మార్పు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలని రైతు సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం,బిజెపి, సిపిఐ, సిపిఎం, ఇతర ప్రజా సంఘాలు రైతులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.
మరోవైపు రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయ నిపుణుల సలహాలతో హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా కేబినెట్ సమావేశం నేపథ్యంలో మందడం, వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి గ్రామాల్లో ఇంటింటికీ పోలీసులు నోటీసులు అంటిస్తున్నారు. ఇళ్లలోకి కొత్తవారిని రానివ్వవద్దనీ, అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే అందుకు బాధ్యత వహించాలనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ పార్టీలు బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశాలను జారీ చేశారు. సచివాలయంలోకి గుర్తింపు కార్డులు ఉంటేనే అనుమతివ్వాలని నిర్ణయించారు. రహదార్ల పక్కన వ్యాపార సంస్థలు, దుకాణాలకు కూడా నోటీసులు అంటించారు. మంత్రివర్గ సమావేశం రోజున ముఖ్యమంత్రి, మంత్రుల కాన్వాయ్, ఉన్నతాధికారుల వాహనాలు, మీడియాకు తప్ప ఇతర వ్యక్తులెవరికీ అనుమతిలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కేబినెట్ సమావేశంలో రాజధానిపై ప్రభుత్వం తుది నిర్ణయం ప్రకటించనుంది.
భూ సమీకరణ రైతులకు గతంలో ఇచ్చిన ప్యాకేజీని పెంచటం ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెక్ పెట్టాలన్న భావనతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగా అధికారుల నుంచి లెక్కలు సేకరిస్తున్నట్లు తెలిసింది. రైతులకు ఏటా ఇస్తున్న కౌలుతో పాటు నివాస, వాణిజ్య ప్లాట్ల ప్యాకేజీలో మార్పులు, చేర్పులు చేయాలనే ఆలోచనలో ఉంది. ఆమోద యోగ్యమైన ప్యాకేజీని ప్రకటించి రైతుల ఆందోళన విరమించేలా సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. గత ఎనిమిది రోజులుగా రైతులు ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు కేబినెట్ సమావేశంలో సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.