ముంబై: మహారాష్ట్రలో కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలో ‘మహావికాస్ ఆఘాడీ’ సంకీర్ణ సర్కారు శనివారం బలపరీక్షను ఎదుర్కోనుంది. ఈ బలపరీక్ష శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీ లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సీఎం ఉద్ధవ్కు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇప్పటికే సూచించారు. ఈ నేపథ్యంలో శనివారమే బలపరీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్కు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక ప్రతిపక్ష బీజేపికి 105 మంది సభ్యులు ఉన్నారు.
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గురువారం ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ మహారాష్ట్ర సచివాలయానికి చేరుకోగానే సీఎం ఉద్ధవ్కు సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఇరవై ఏళ్ళ తరువాత శివసేనకు చెందిన నేత మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అంతేకాదు ఠాక్రే కుటుంబంలో ఈ పదవిని మొదటిసారిగా చేపడుతున్న వ్యక్తి కూడా ఉద్ధవ్ ఠాక్రే రికార్డు సృష్టించారు.
ఇదిఇలా ఉంటే.. 43 మంత్రివర్గ శాఖల్లో శివసేన 16, ఎన్సీపీ 15, కాంగ్రెస్ పార్టీకి 12 పదవులు దక్కనున్నాయి. శివసేనకు చెందిన ఏక్ నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, ఎన్సీపీ నేత జయంత్ పాటిల్, ఛగన్ భుజ్ బల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ రావత్ లు మంత్రులుగా ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి స్పీకర్ పదవి దక్కుతుందని సమాచారం. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ మళ్ళీ పదవి పొందనున్నారని తెలుస్తోంది.