ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు రావడంలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ చేసిన కృషే కారణమని శివసేన చీఫ్ ఉద్దవ్ఠాక్రే అన్నారు. శనివారం అయోధ్య తీర్పుపై ఆయన మాట్లాడుతూ.. నాడు అద్వానీ చేసిన పోరాటం, త్యాగం ఫలితంగానే నేడు అనుకూలంగా తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే తాను ఎల్కే అద్వానీని కలిసి శుభాకాంక్షలు తెలుపుతానని ఠాక్రే తెలిపారు. ఈ అంశంలో రథయాత్రను చేపట్టిన ఘనత అద్వానిదే.. ఆయన్ను తప్పకుండా కలిసి ఆశీర్వాదాన్ని పొందుతానని చెప్పారు. అలాగే ఈ నెల 24న అయోధ్యలో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు.
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పును కేంద్ర ప్రభుత్వం తన ఘనతగా చాటుకోలేదని ఇదివరకే శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి చట్టం చేయాలని తాము ప్రభుత్వాన్ని కోరితే అందుకు నిరాకరించిందని, సుప్రీం తాజా తీర్పును ప్రభుత్వం ఇప్పుడు తమ ఘనతగా చెప్పుకోరాదని ఠాక్రే పేర్కొన్నారు.
ఇదిఇలా ఉంటే.. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా సీఎం పదవి తమకు కావాలని డిమాండ్ చేయడంతో బీజేపీ, శివసేనల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఠాక్రే అద్వానీని కలిసి ఆశీర్వాదం తీసుకుంటాననటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.