ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. మహారాష్ట్ర సీఎంగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మేరకు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శుక్రవారం సాయంత్రం ముంబైలో మూడు పార్టీల నేతలు సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఉద్ధవ్ ఠాక్రే ఐదేళ్లపాటు సీఎం పదవిలో కొనసాగేలా ఈ కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. మహారాష్ట్రకు కాబోయే సీఎం ఉద్ధవ్ ఠాక్రే అని ప్రకటించారు. ఎన్సీపీ, కాంగ్రెస్కు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించినట్లు తెలిపారు. ఈ ఒప్పందంపై మూడు పార్టీల ఎమ్మెల్యేలే సంతకాలు చేసినట్లు వెల్లడించారు.
‘మహారాష్ట్రకు కాబోయే సీఎంగా ఉద్ధవ్ థాక్రేను మూడు పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ప్రభుత్వ ఏర్పాటుపై మరోసారి చర్చలు జరుగుతాయి. రేపు మూడు పార్టీల నేతలం కలిసి జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం. గవర్నర్ను ఎప్పుడు కలవాలన్న దానిపై శనివారం నిర్ణయం తీసుకుంటాం’ అని శరద్ పవార్ పేర్కొన్నారు. దీంతో మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది.
మరోవైపు శనివారం ఢిల్లీలో గవర్నర్స్ కాన్ఫరెన్స్కు హాజరుకావాల్సి ఉన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అధికారం విషయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు తగిన మద్దతు సాధించడంలో ప్రధాన పక్షాలైన బీజేపీ, శివసేన, ఎన్సీపీ విఫలమవడంతో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన బీజేపీ, శివసేన పార్టీలకు సీఎం పీఠం వద్ద పేచీ వచ్చింది. అక్టోబర్ 24న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగింది. మొత్తం 288 స్థానాలు గల మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు కావాలి. బీజేపీ 105 స్థానాలు, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, శివసేన కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. అయితే, సీఎం పీఠంపై కన్నేసిన శివసేన ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములా ప్రతిపాదించింది. సీఎం పీఠాన్ని పంచుకోవాలని కోరగా.. అందుకు బీజేపీ అంగీకరించలేదు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ, శివసేన, ఎన్సీపీలను గవర్నర్ ఆహ్వానించినప్పటికీ… ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించారు.
అయితే, తాజాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. దీంతో నెల రోజులుగా మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు తెరపడింది. ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉండాలని ముందు నుంచి కాంగ్రెస్, ఎన్సీపీ ప్రతిపాదిస్తున్న సంగతి తెలిసిందే. మూడు పార్టీల నాయకుల మధ్య వారం రోజుల పాటు చర్చల తర్వాత కూటమితో ప్రభుత్వ ఏర్పాటు కొలిక్కి వచ్చింది.