యూకే నేరస్తుడికి యావజ్జీవ ఖైదు
భారత సంతతి మహిళ దారుణహత్య
లండన్: భారత సంతతికి చెందిన తన భార్యను గత సంవత్సరం క్రిస్టమస్ రోజు జరిగిన చిన్న గొడవతో పొడిచి చంపినందుకు యూకేకు చెందిన ఓ వ్యక్తికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. ఏంజెలా మిట్టల్ (41) అనే తన భార్యను పదే పదే రెండు చాకులతో పొడిచి చంపినట్లు లారెన్స్ బ్రాండ్ (47)పై నేరం రుజువైంది. అతడికి కనీసం 16 సంవత్సరాల 8 నెలల జైలు శిక్ష విధిస్తున్నట్లు రీడింగ్ క్రౌన్ కోర్టు తన విచారణ అనంతరం తీర్పునిచ్చింది.
బెర్క్ షైర్ లోని షిన్ ఫీల్డ్ ప్రాంతంలో గల తమ ఇంట్లో జరిగిన ఈ గొడవలో ఏంజెలా మెడ మీద, గుండెల్లోను 59 సార్లు కత్తిపోట్లు పడ్డాయి. ఈ విషయాన్ని జడ్జి హీథర నార్టన్ తన తీర్పు వెల్లడించే సందర్భంలో తెలిపారు. ‘‘నువ్వు నీ భార్యను ఇంట్లోని బెడ్రూంలో పొడిచి చంపావు. నీ దాడి చాలా దారుణమైనది. ఆమెను కనీసం 59 సార్లు పొడిచావు’’ అన్నారు. అలా పొడిచేటపుడు ఒక చాకు విరిగిపోయిందని, దాంతో వంటగదిలోకి వెళ్లి మరో చాకు తెచ్చి మళ్లీ పొడిచాడని చెప్పారు.
బాధితురాలు దాడినుంచి తప్పించుకోడానికి చాలా ప్రయత్నం చేసిందని ఫోరెన్సిక్ సాక్ష్యాలను బట్టి తేలింది. సొంత ఇంట్లో సురక్షితంగా ఉంటుందని భావిస్తారని, కానీ అదే ఆమెకు నరకం అయ్యిందని పోలీసులు చెప్పారు. ఏంజెలాకు సాయం చేయాల్సింది పోయి తొలుత ఇల్లంతటినీ శుభ్రం చేసి, తర్వాత 999కు ఫోన్ చేశాడన్నారు. అప్పుడు కూడా అంబులెన్సు కావాలని చెప్పలేదని, అంటే ఇక ఆమె బతకదని నిర్ణయించేసుకున్నాడని తెలిపారు.
ఏంజెలా తల్లిదండ్రులు భరత్ మిట్టల్, కమలా మిట్టల్ ఈ ఘటనపట్ల తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. మతిలేని నేరం వల్ల ఆమె జీవితం విషాదాంతమైందని అన్నారు. ఆమె ఎప్పుడూ సరదాగా ఉండేదని, స్నేహితులతో మాట్లాడుతూ, జీవితాన్ని తన కుటుంబం కోసమే వెచ్చించేదని చెప్పారు. అన్ని వర్గాల వారినీ ఒక్క చోటుకు చేర్చగలిగే అరుదైన కళ ఆమెకు ఉందని, వారందరితో మంచి సంబంధాలు ఉండేవని తెలిపారు.