(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఫోని తీవ్ర పెను తుపాను స్థాయిలో తీరం దాటినా ప్రాణనష్టం కనిష్ట స్థాయికి పరిమితం చేసిన భారత ప్రభుత్వ పని తీరును ఐక్యరాజ్యసమితి ప్రశంసించింది.
సరైన అంచనాలు, ముందస్తు హెచ్చరికలు, ఆపై సహాయక చర్యలతో ప్రజలను భారీ నష్టం నుంచి కాపాడారని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం అభినందనల వర్షం కురిపించింది.
ఫోని తీవ్ర తుపాను ప్రభావంలోనూ ప్రాణనష్టాన్ని తగ్గించడంలో భారత ప్రభుత్వం చూపించిన పనితీరు అద్భుతమని ప్రశంసించింది.
అత్యంత ఖచ్చితమైన వాతావరణ హెచ్చరికలతో భారత వాతావరణ విభాగం (ఐఎండి) తనవంతు పాత్రను సమర్థంగా పోషించిందని డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ విభాగం ప్రతినిధి డెన్నిస్ మెక్ క్లీన్ అన్నారు.
ఐఎండి అందించిన సరైన సమాచారంతో తుపాను ప్రభావిత ప్రాంతాలను గుర్తించి 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని డెన్నిస్ పేర్కొన్నారు.
ఇదే తరహాలో 1999లో ఒడిశాను తాకిన తుపాను సుమారు 10 వేల మందిని బలిగొన్నది కానీ భారత్ పాఠాలు నేర్చుకుని ఫోని విషయంలో మరణాల సంఖ్యను చాలా తగ్గించి వేసిందని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రతినిధి క్లేర్ నల్లిస్ వివరించారు.
శుక్రవారం ఉదయం ఒడిశాలోని పూరీ వద్ద ఫోని తీరం దాటిన నేపథ్యంలో మృతుల సంఖ్య పది మందిగా అధికారులు తెలియజేశారు.