పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక ర్యాలిలో పాల్గొంటున్న మసూద్ అజర్ (ఫైల్ ఫొటో)
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జైషె మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను ఎట్టకేలకు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ టెరరిస్టుగా ప్రకటించింది. అజర్పై ఈ చర్య తీసుకోవాలన్న భారత్ అభ్యర్ధనను సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలలో ఒకటయిన చైనా ఇంతకాలం సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ వ్యతిరేకిస్తూవచ్చింది. చివరికి ప్రపంచ దేశాలలో వస్తున్న వ్యతిరేకత చూసి చైనా వైఖరి మార్చుకుంది.
ఇది దౌత్యపరంగా ఇండియాకు పెద్ద విజయం కింద లెక్క. మసూద్ అజర్పై అధికారికంగా అంతర్జాతీయ టెరరిస్టు ముద్ర వేయించేందుకు ఇండియా గత పదేళ్లుగా ప్రయత్నిస్తోంది. ప్రయత్నించిన ప్రతిసారీ చైనా అడ్డుకుంది. మొత్తం నాలుగుసార్లు చైనా అజర్ను ఆదుకుంది. పుల్వామా దాడి తర్వాత తాజాగా ఇండియా చేసిన ప్రయత్నానికి కూడా చైనా మోకాలు అడ్డుపెట్టింది.
అయితే అమెరికా నుండి చైనాకు తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. మరోపక్క బ్రిటన్, ఫ్రాన్స్ నుంచి కూడా చైనాపై వత్తిడి మొదలయింది. దానితో సమితి భద్రతా మండలిలో బుధవారం వచ్చిన తీర్మానానికి చైనా సమ్మతి తెలిపింది. గ్లోబల్ టెరరిస్టుగా సమితి ప్రకటించిన ఫలితంగా మసూద్ అజర్ ఆస్థులు, ఆదాయమార్గాలను ప్రపంచదేశాలు స్థంభింపజేయాల్సి ఉంటుంది.
మసూద్ అజర్ మొదట హర్కత్ ఉల్ అన్సార్ అనే ఉగ్రవాద సంస్థ పేరుమీద కార్యకలాపాలు నడిపాడు. 1994లో కశ్మీర్లో భద్రతాదళాలు అతనిని అరెస్టు చేశాయి. నాలుగేళ్ల తర్వాత మసూద్ అనుచరులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ చేసి అజర్ విడుదలను డిమాండ్ చేశారు. ఆనాటి వాజ్పేయీ ప్రభుత్వం అజర్ను, మరో ఇద్దరు టెరరిస్టులనూ ఆప్ఘనిస్థాన్లోని కాందహార్లో వారికి అప్పగించి విమాన ప్రయాణికులను విడిపించుకుంది.
అప్పటినుంచీ పాకిస్థాన్ నిఘాసంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీస్ ఇంటలిజెన్స్) అండదండలతో మసూద్ అజర్ తన ఉగ్రవాద కార్యకలాపాలు పాక్ భూభాగం నుంచి నడిపిస్తూవచ్చాడు.
20012 నాటి పార్లమెంట్పై దాడి. 2008 నాటి ముంబై దాడులు, 2016 నాటి పఠాన్కోట్ వైమానికస్థావరంపై దాడి, మొన్నటి పుల్వమా దాడి అన్నీ మసూద్ అజర్ నేతృత్వంలో జరిగిన ఉగ్రవాద చర్యలే. మసూద్ అజర్పై గ్లోబల్ టెరరిస్టు ముద్ర వేయగానే అందుకోసం కృషి చేస్తూ వచ్చిన సమితిలో భారత రాయబారి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా ఈ విషయం తెలియపరిచారు.
Big,small, all join together.
Masood Azhar designated as a terrorist in @UN Sanctions list
Grateful to all for their support. ??#Zerotolerance4Terrorism
— Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019