(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు చైనా అభ్యర్థన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ భారత్ నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను అంచనా వేసేందుకు సమావేశమవుతోంది. చైనా విన్నపం మేరకు భద్రతామండలి ఇవాళ జమ్ముకశ్మీర్ అంశాన్ని చర్చించనుంది. గత ఆగస్ట్లో జరిగినట్లుగానే ఈ సమావేశం కూడా పూర్తిగా రహస్యంగా (క్లోజ్డ్ డోర్) జరగనుంది. ఇదే అంశంపై చైనా, పాకిస్థాన్ కోరిక మేరకు ఆగస్టులో భద్రతామండలి భేటీ అయింది. ఆ తర్వాత ఈ అంశంపై సెక్యూరిటీ కౌన్సిల్ భేటీ కానుండటం ఇదే తొలిసారి.
జమ్ముకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ డిసెంబర్ 12న భద్రతామండలికి లేఖ రాశారు. సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. పాక్ విన్నపాన్ని ప్రస్తావిస్తూ ఐరాసకు చైనా కూడా లేఖ రాసింది. ‘పాకిస్థాన్ ఆందోళనతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. పరిస్థితుల తీవ్రత మరింత విషమించే ప్రమాదం పొంచి ఉన్నందున జమ్ముకశ్మీర్ ప్రస్తుత పరిస్థితులపై భద్రతామండలిలో చర్చ జరగాలి’ అని కౌన్సిల్ కు పంపిన లేఖలో చైనా పేర్కొంది.