(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడులతో బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని భావిస్తోందా ? సైనికుల త్యాగాలను, వారి సాహసాలను కూడా ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టేందుకు వాడుకుంటారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల వేళ పీవోకేలో దాడులు జరగడంతో దీనికి రాజకీయ రంగు పులుముకుంది. పాకిస్తాన్ పై భారత్ దాడుల కారణంగా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీకి సీట్లు పెరిగాయని, తాజా ఎన్నికల్లోనూ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఓట్లు వేస్తారని బీజేపీ నాయకులు భావిస్తున్నారట. గడిచిన కొద్ది కాలంగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. అందుకు కొద్ది రోజుల ముందు పాకిస్తాన్ పై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు పుల్వామా ఉగ్రదాడిపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దుల్లో నక్కిన ఉగ్రవాదులను హతమార్చింది. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, లబ్ది పొందడానికే మోదీ ఈ పథక రచన చేశారని అప్పట్లో విపక్షాలు ఆరోపించాయి. 2016 సెప్టెంబర్లో భారత సైనికులు నియంత్రణరేఖను దాటి వెళ్లి ఉగ్రవాద శిబిరాలపై జరిపిన మెరుపు దాడులు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ దాడులు జరిగాయి.
పెద్ద నోట్ల రద్దు లాంటి సంచలన నిర్ణయం తర్వాత జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది. పాకిస్తాన్ పై ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించడంతో గెలుపు సాధ్యమైంది. నోట్ల రద్దుతో వచ్చిన వ్యతిరేకత సర్జికల్ స్ట్రయిక్లతో పోయింది. దీంతో ఓట్ల కోసమే మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రయిక్లను రాజకీయం చేస్తున్నదంటూ కాంగ్రెస్ ఘాటుగా విమర్శించింది. ఆర్మీని గౌరవించాల్సింది పోయి ఆ ఘనతను మోదీకి ఆపాదిస్తూ బీజేపీ పబ్బం గడుపుకొంటున్నదని మండిపడింది. అయితే, సర్జికల్ దాడులపై భారత ప్రజల ఉత్సాహాన్ని నీరుగార్చేలా… పాక్ వైఖరికి మద్దతు పలికేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది.
Congress' Akhilesh Singh on Indian Army used artillery guns to target terrorist camps in PoK: Under Modi ji’s govt, whenever there's election in a big state,pattern of surgical strike is formed. Now,politics will be done on surgical strike to divert attention from real issues pic.twitter.com/5pH1oK0lX4
— ANI (@ANI) October 20, 2019
ఇదిఇలా ఉంటే.. తన నాయకత్వంలోనే భారత దేశం అన్నివిధాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతున్నదని, దేశ గౌరవం, ప్రతిష్ఠను ప్రపంచదేశాల్లో ఇనుమడింపజేశానని ప్రధాని మోదీ ప్రచారం చేశారు. ఇదంతా తన నాయకత్వ శక్తిమూలంగానే సాధ్యమైందని కూడా ప్రజల్లో విశ్వాసం కలిగించగలిగారు. సరిగ్గా ఈ సమయంలోనే బాలాకోట్ లక్షితదాడితో తన చేతుల్లోనే భారత్ సురక్షితంగా, శత్రు దుర్బేధ్యంగా ఉంటుందని బలంగా చెప్పుకున్నారు. శత్రుదేశాలకు బదులిచ్చే దేశంగా తీర్చిదిద్దానని ప్రజలకు భరోసా కల్పించారు.
మరోవైపు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, అమిత్షా సారథ్యంలోని బీజేపీ విఫలమైనప్పుడల్లా రాజకీయ లబ్ధి కోసం సైనికుల పరాక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వివిపిస్తున్నాయి. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆదివారంనాడు పెద్దఎత్తున ప్రతిదాడులపై విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాలు, టెర్రర్ లాంఛ్ ప్యాడ్ల లక్ష్యంగా భారత సైన్యం దాడులు చేసింది. ఈ దాడుల్లో పాకిస్తాన్ వైపు భారీ నష్టం జరిగినట్టు సమాచారం. అయితే ఈ అంశం మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని బీజేపీ భావిస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, పీవోకేపై దాడి రెండు అంశాలు ఎన్నికల్లో మెజారిటీని సాధించి పెడతాయనే ధీమా బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. మహారాష్ట్ర, హర్యానాలో మిత్ర పక్షాలు చేదోడుగా నిలిచినా, ఈ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. చిత్రంగా రెండు రాష్ట్రాల్లో పోలింగుకు ముందే బీజేపీ గెలుపు, కాంగ్రెస్ ఓటమి ఖరారైపోయినట్లుగానే నేతలు ప్రచారం చేయడం గమనార్హం.