శ్రీనగర్: ఆర్టికల్ 370 జమ్మూకాశ్మీర్కు వర్తించకుండా చేసిన తర్వాత అక్కడ పలు పార్టీలకు చెందిన నాయకులను, ఇతరులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలో అనేకమంది విడుదల కోరుతూ జమ్మూకాశ్మీర్ హైకోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అగస్టు 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు 252 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వ నిర్బంధ చర్యలను సవాల్ చేస్తూ కొంత మంది ఈ రిట్లు వేశారు. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టులో హాజరుపరచల్సిందిగా హెబియస్ కార్పస్ రిట్ కింద ఆదేశించే అధికారం హైకోర్టులకూ సుప్రీంకోర్టుకూ ఉంది. అయితే జమ్ము కశ్మీర్ హైకోర్టులో దాఖలయిన ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ల పరిష్కారం విషయంలో ఆ కోర్టుకు ఏమాత్రం తొందర లేకపోయిందని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ ప్రత్యేక కథనం రాసింది.
గత నెల ఆగస్ట్ 16న జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిత్తల్తో తాను ఫోన్ లో మాట్లాడినట్లు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎ బొబ్డే ధర్మాసనం నుంచి తెలిపారు. అక్కడ సమాచార వ్యవస్థ ప్రస్తుతం బాగుందని, బీఎస్ఎన్ఎల్ సేవలు ప్రారంభమ్యయాయనీ గీతా మిత్తల్ తెలిపినట్లు ఆయన చెప్పారు. కశ్మీరీ ప్రజలకు హైకోర్టు అందుబాటులో లేకుండా పోయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో తనకు నివేదిక సమర్పించాలని జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సెప్టెంబర్ 16న ఆదేశించారు. ఈ రెండు పరిణామాల మధ్యలో అక్కడ నెలకొన్న వాతావరణం చాలా ఆందోళనకరమైనది.
గత నెలలో భారీ స్థాయిలో 250 హెబియస్ కార్పస్ పిటిషన్లు జమ్ము కశ్మీర్ హైకోర్టులో దాఖలయ్యాయి. అంటే సుమారుగా రోజుకు ఆరు పిటిషన్లు అన్నమాట. ఈ సంగతిని జమ్ము కశ్మీర్లో పరిస్థితిపై విచారణ చేస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి దాచారు.
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని గత నెల ఆగస్టు 5న కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత సెప్టెంబర్ 19 వరకూ మొత్తం 252 హెబియస్ కార్పస్ పిటిషన్లు శ్రీనగర్ లోని హైకోర్టులో దాఖలయ్యాయి. గురువారం వరకూ దాఖలైన పిటిషన్ల వివరాలను ఇండియన్ ఎక్స్ ప్రెస్ తేదీలతో సహా వెల్లడించింది. తొలి పిటిషన్ను జమ్ముకశ్మీర్ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగస్టు 5న దాఖలు చేసింది. సిఆర్పిసి 491 సెక్షన్ కింద దీనిని దాఖలు చేశారు. సెప్టెంబర్ 3న అత్యధికంగా 24 పిటిషన్లు దాఖలైయ్యాయి. ఎక్కువ భాగం పిటిషన్లు ప్రజా భద్రత చట్టం లోని సెక్షన్ 22 కింద దాఖలయ్యాయి. మొత్తం పిటిషన్లలో 147 పిటిషన్లు విచారణకు స్వీకంరించే దశలో ఉన్నాయి. 85 పిటిషన్లు ఉత్తర్వుల కోసం ఎదురు చూస్తున్నాయి. 20 పిటిషన్లు ఏ దశలో ఉన్నదీ తెలియరాలేదు.
వ్యక్తి ప్రాణం కాపాడాలనీ, భద్రత కల్పించాలనీ కోరే పిటిషన్ కాబట్టి హెబియస్ కార్పస్ అత్యంత త్వరిత గతిన విచారించాల్సిన రిట్ పిటిషన్. జమ్ము కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసి, దానిని అసలు రాష్ట్రంగానే లేకుండా చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత అక్కడి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్లకు ఎదురవుతున్న పరిస్థితి ఇది.