విశాఖ: ఏపీలోని బీజేపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందనే ఫిర్యాదులు తమకు అందుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే వైసీపీ కూడా చేస్తోందని విమర్శించారు. బుధవారం ఉదయం కిషన్ రెడ్డి విశాఖ బీచ్లో నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి…వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేస్తోందని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా మంచి పాలన అందించాలని, కక్ష సాధింపులు మంచి సంప్రదాయం కాదనే విషయం గ్రహించాలని సూచించారు. ఏపీలో అన్యమత ప్రచారం జరుగుతోందని.. బలవంతపు మతమార్పిడులు మంచిది కాదన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ఎక్కడైనా సరే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. జగన్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. అమృత్ పథకం కింద విశాఖకు నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ఇక మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన వ్యవహారంపై కిషన్ రెడ్డి స్పందించారు. పొత్తు ధర్మానికి శివసేన తూట్లు పొడిచిందని… పొత్తు లేకపోతే బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.