గుజరాత్: కేంద్రమంత్రి ప్రతాప్ సారంగీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో ఉండాలంటే వందేమాతరం పాడాల్సిందేనని స్పష్టం చేశారు. వందేమాతరాన్ని అంగీకరించకపోతే.. వారు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచి వెళ్లిపోవచ్చన్నారు. వందేమాతరం అంగీకరించని వారికి భారతదేశంలో నివసించే హక్కు లేదన్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆందోళనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేసిన పాపానికి ప్రాయశ్చిత్త మార్గమే ఈ సీఏఏ అని చెప్పారు. డెబ్బై ఏళ్ల క్రితమే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాల్సిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అలా చేయకుండా.. మతరాజకీయాలు చేసిందని ఆరోపించారు. దేశాన్ని మత ప్రాతిపదికన విభజన చేశారన్నారు. పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మైనార్టీలైన హిందువులపై దాడులు జరుగుతున్నాయని, వారి సంఖ్య నానాటికి తగ్గిపోతుందన్నారు. ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి అందరూ కృతజ్ఞతలు తెలపాలన్నారు. ఈ చట్టంపై కాంగ్రెస్ పార్టీ లేనిపోని అపోహలను సృష్టిస్తోందని మండిపడ్డారు.
#WATCH Union Minister Pratap Sarangi in Surat, Gujarat: Those who do not accept Vande Mataram have no right to live in India. (18.01.2020) pic.twitter.com/zEr4R8Z7Op
— ANI (@ANI) January 18, 2020