వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ ఫైటర్ జెట్ పతనానికి దారి తీసిన డాగ్ ఫైట్ వివరాలు క్రమంగా బయటకు వస్తున్నాయి. బుధవారం జరిగిన ఈ డాగ్ ఫైట్లో మొత్తం 24 పాకిస్థానీ యుద్ధ విమానాలను ఎనిమిది ఇండియా ఫైటర్ జెట్స్ నిలువరించినట్లు తాజాగా తెలిసిందని ఎన్డిటివి పేర్కొన్నది.
గగనతలంలో యుద్ధవిమానాలు పరస్పరం తలపడడాన్ని డాగ్ ఫైట్ అంటారు. ఉదయం 9:45 గంటలకు వాస్తవాధీన రేఖకు పది కిలోమీటర్ల దూరంలో పాక్ విమానాల రాకను భారత వైమానిక దళం పసికట్టింది. దాడి అమరికలో వస్తున్న ఎనిమిది ఎఫ్16 విమానాలు, నాలుగు మిరేజ్-3 విమానాలు, నాలుగు చైనా తయారీ జెఎఫ్-17 థండర్ ఫైటర్స్కు రక్షణగా మరో ఎనిమిది విమానాలు వచ్చాయి.
వీటిలో కొన్ని వాస్తవాధీన రేఖ దాటినపుడు భారత ఫైటర్ విమానాలు వాటితో తలపడ్డాయి. భారత్ విమానాలలో నాలుగు సుఖోయ్30, రెండు మిరేజ్2000, రెండు మిగ్21 బైసన్ విమానాలు ఉన్నాయి. పాక్ విమానాలు కొన్ని లేజర్ గైడెడ్ బాంబులు విసిరి వెనక్కు వెళుతుండగా భారత్ విమానాలు వాటితో తలపడ్డాయి. వర్ధమాన్ తన మిగ్21తో ఒక పాక్ ఎఫ్16 విమానం వెంట పడ్డాడు. ఆర్-73 మిస్సైల్ను ప్రయోగించాడు. దానితో ఎఫ్16 కూలింది. అదే సమయంలో దానికి రక్షణగా ఉన్న ఇతర ఎఫ్16 విమానాలలో ఒకటి మిగ్పై మిస్సైల్ ప్రయోగించింది. దానితో వర్ధమాన్ విమానం కూడా కూలింది. ఇద్దరు పైలట్లూ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో దిగారు.