(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ఫరూఖాభాద్: ఉత్తరప్రదేశ్లో 23 మంది పిల్లలను బందీ చేసిన వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. అతని భార్యను గ్రామస్థులు కొట్టి చంపారు. పిల్లలందరూ క్షేమంగా ఉన్నారు.
తన కుమార్తె పుట్టినరోజు పండగ కోసమంటూ గురువారం సుభాష్ భాతం అనే వ్యక్తి 23 మంది పిల్లలను ఇంటికి ఆహ్వానించి వారిని లోపల బంధించాడు. కాస్సేపటి తర్వాత విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు వెళ్లినపుడు వారిపై కాల్పులు జరిపాడు. దానితో పోలీసులకు కబురు వెళ్లింది. వారితో పాటు యాంటీ టెరరిస్టు స్క్వాడ్ కమెండోలు కూడా అక్కడకు వెళ్లారు.
లొంగిపోవాలంటూ సుభాష్కు నచ్చజెప్పేందుకు సాగిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గురువారం అర్ధరాత్రి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు. సుభాష్ను కాల్చి చంపారు. 2001లో జరిగిన ఒక హత్య కేసులో సుభాష్ నిందితుడు. తాను నిర్దోషినని అతను అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
సుభాష్ను హతమార్చి పోలీసులు పిల్లలను బయటకు తీసుకువస్తున్న సమయంలో అతని భార్య పారిపోతూ గ్రామస్థుల కంటపడింది. దానితో వారు రాళ్లు విసిరుతూ ఆమె వెంటపడ్డారు. విచక్షణా రహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె తర్వాత ఆసుపత్రిలో మృతి చెందింది. పిల్లలను బంధించిన నేరంలో ఆమె పాత్ర ఉన్నదీ లేనిదీ తెలియదు.