లక్నో: బిజెపి నేత చిన్మయానంద్ పై అత్యాచారం కేసు మరో మలుపు తిరిగింది. చిన్మయానంద్ పై ఆరోపణలు చేసిన లా విద్యార్థినిని డబ్బు గుంజేందుకు ప్రయత్నించారన్న ఆరోపణల కేసులో యూపీ పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి లా విద్యార్థిని చిన్మయానంద్ నుంచి డబ్బు గుంజేందుకు పథక రచన చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ లా విద్యార్థిని కోర్టుకు అప్పీలు చేసుకుంది. మంగళవారం ఆమె పిటిషన్ కోర్టు విచారించింది. బాధిత యువతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అత్యాచారం కేసులో సెప్టెంబర్ 20న చిన్మయానంద్ ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. చిన్మయానంద్కు కోర్టు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీని విధించింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు స్థానిక కోర్టు నిరాకరించింది. అత్యాచారం కేసులో ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఇదిఇలా ఉంటే డబ్బు గుంజేందుకు ప్రయత్నించారన్న కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత లా విద్యార్థిని దోపిడికి వ్యూహ రచన చేసిందని నిందారోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ కేసులో ఆమె పాత్రపై ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో చిన్మయాంనంద్ పలు ఆశ్రమాలు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్నారు. షాజహాన్పూర్లోని ఎస్ఎస్ న్యాయ కాలేజీ చెందిన 23 ఏళ్ల లా స్టూడెంట్.. చిన్మయానంద్ ఎంతోమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడంటూ ఆరోపణలు చేసింది. గత ఆగస్ట్ 24న ఫేస్ బుక్ లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. తాను స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన చిన్మయానంద్.. తనను బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాది పాటు లైంగికదాడి చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తుపాకీతో బెదిరించి తన చేత బలవంతంగా మసాజ్ కూడా చేయించుకున్నాడని సదరు లా విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బాధిత విద్యార్థినితోపాటు చిన్మయానంద్ ను విచారించారు. అయితే, అప్పటికీ ఆయనపై కేసు నమోదు చేయకపోవడంతో పోలీసుల తీరుపై బాధితురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తాను చనిపోతేగానీ చిన్మయానంద్ పై కేసు పెట్టరేమెనని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిన్మయానంద్ ను సెప్టెంబర్ 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల నేరారోపణలపై అరెస్టు అయిన చిన్మయానంద్ కేసును పోలీసులు నీరుగారుస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. కొంతమంది తన అభియోగాలను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొంది.