లక్నో: బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారిని గుర్తించి బయటకు పంపేందుకు అస్సాంలో జాతీయ పౌరసత్వం జాబితా (ఎన్ఆర్సి) రూపొందించడం అనే తతంగం జరిపితే ఉత్తరప్రదేశ్లో ఆ మాత్రం కూడా లేకుండా ‘విదేశీయుల’ను బయటకు పంపే పని మొదలుపెట్టబోతున్నారు. బంగ్లాదేశీయులనూ, ఇతర విదేశీయులనూ వెలుపలికి పంపేందుకు వీలుగా వారిని గుర్తించే పని వెంటనే మొదలుపెట్టాల్సిందిగా ఉత్తరప్రదేశ్ డిజిపి అన్ని జిల్లాల ఎస్పిలనూ ఆదేశించారు.
విదేశీయులను గుర్తించి బయటకు పంపే పని నిర్దేశిత గడువు లోగా పూర్తవుతుందనీ, ఈ కార్యక్రమాన్ని సీనియర్ పోలీసు అధికారులు పర్యవేక్షిస్తారనీ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అస్సాంలో ఎన్ఆర్సి రూపొందించిన ఫలితంగా తమ పౌరసత్వం నిరూపించుకోలేని వారు 19 లక్షల మంది తేలారు.
మురికివాడల్లో, రవాణా కేంద్రాలలో గాలించాలనీ, అనుమానాస్పదంగా ఉన్నవారి గుర్తింపు పత్రాలు తనిఖీ చేయాలనీ ఉత్తరప్రదేశ్ డిజిపి ఆదేశించారు. రాష్ట్ర ఆంతర్గత భద్రతకు ఈ చర్య ఎంతైనా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి తతంగాన్నిగత నెలలో పొగిడారు. తన రాష్ట్రంలో కూడా అలాంటి ప్రక్రియ చేపడతామని ఆయన అన్నారు. దేశ భద్రతకు ఇది చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.