శ్వేతజాతి నేరస్తుడికి అమెరికా కోర్టు ఆదేశం
స్టోరులో సిక్కు ఉద్యోగిపై మత విద్వేష దాడి
న్యూయార్క్: అమెరికాలో శిక్షలు విచిత్రంగా ఉంటాయి. సిక్కు వ్యక్తి మీద మత విద్వేషంతో దాడి చేసిన శ్వేత జాతీయుడికి.. శిక్షలో భాగంగా ఆ మతం గురించి నేర్చుకుని, దాని గురించి ఒక నివేదిక కోర్టుకు సమర్పించాలని జడ్జి ఆదేశించారు. ఆండ్రూ రామ్సే (25)కు మూడు సంవత్సరాల జైలుశిక్ష విధించడంతో పాటు ఈ పని కూడా అప్పగిస్తూ మారియన్ కౌంటీ జడ్జి లిండ్సే పాట్రిడ్జ్ తీర్పునిచ్చారు. అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో గల ఓ స్టోరులో పనిచేస్తున్న హర్వీందర్ సింగ్ పై జనవరి 14న రామ్పే దారుణంగా దాడిచేశాడు. సిగరెట్ల కోసం రోలింగ్ పేపర్ కావాలని రామ్సే ఆ స్టోరుకు వచ్చాడు. కానీ, అతడి వద్ద ఐడీ లేకపోవడంతో చట్టప్రకారం అమ్మకూడదని అక్కడి క్లర్కు చెప్పారు. అక్కడినుంచి వెళ్లిపోవాలని హర్వీందర్ చెప్పగా, ఆయన గడ్డం పట్టుకుని లాగి ముఖం మీద కొట్టి, నేలమీదకు తోసి అక్కడ కూడా కొట్టాడు. ఆయన తలపాగా కూడా తీసి విసిరి పారేశాడు.
ఇదంతా సెకండ్ డిగ్రీ మతవిద్వేష నేరం కావడంతో అతడిని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా, తాను నిర్దోషినని వాదించాడు. కానీ కోర్టు మాత్రం అతడికి 36 నెలల జైలుశిక్ష విధించింది. స్థానిక గురుద్వారాలో ప్రతియేటా జరిగే ఉత్సవానికి హాజరై, ఆ మతం గురించి తెలుసుకోవాలని జడ్జి ఆదేశించారు. అతడికి డ్రగ్స్, మద్యం అలవాట్లు తప్పించే చికిత్సతో పాటు మానసిక చికిత్స కూడా చేయించాలని తెలిపారు. దేశంలో ప్రతి వ్యక్తీ భయం లేకుండా జీవించగలగాలని, తన మతాన్ని స్వేచ్ఛగా అవలంబించుకోగలగాలని హర్వీందర్ కోర్టుకు లేఖ రాశారు. అమెరికాలో సిక్కులపై మతవిద్వేష నేరాలు తరచు జరుగుతుంటాయి.