(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సక్రమంగా నిర్వహించలేదని ఆరోపిస్తూ నేరేడుచర్ల సెంటర్ లో పీసీసీ చీఫ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కేవీపీ, కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. ఈసీ నాగిరెడ్డి అధికార పార్టీకి అనుకూలంగా వ్యహరించారని ఆరోపించారు. ఎన్నికల అధికారులు టీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో ఉత్తమ్, కేవీపీతోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
అంతకముందు.. మున్సిపల్ చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ బహిష్కరించింది. కాంగ్రెస్, సీపీఎం సభ్యులు సమావేశం నుంచి బయటకు వచ్చారు. మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో గందరగోళం నెలకొంది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఓటు చెల్లదంటూ కాంగ్రెస్ నిరసన తెలిపింది. రాత్రికి రాత్రే ఓటు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుభాష్ రెడ్డిని బయటికి పంపించాలని కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్ జరిపితే ఆత్మహత్య చేసుకుంటామని కాంగ్రెస్ సభ్యులు బెదిరించారు. అలాగే ఓటింగ్ జరిపే ప్రయత్నం చేయడంతో కాంగ్రెస్ సభ్యులు ఎన్నికను బహష్కరించి బయటకు వచ్చారు.
ఉదయం 11 గంటలకు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాగానే ప్రమాణస్వీకారం కాకముందే స్థానిక ఎంపీ ఉత్తమ్, కాంగ్రెస్ సభ్యులు ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా సేపు ఎన్నికల అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే, తాము లిస్టు తయారు చేయలేదు, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన లిస్టు ప్రకారమే చేస్తామని అధికారులు పేర్కొంటూ ఎన్నికను కొనసాగించారు. అనంతరం మున్సిపాలిటీ ఛైర్మన్ గా జయబాబు, వైస్ ఛైర్ పర్సన్ గా శ్రీలతారెడ్డి ఎన్నికయ్యారు.