(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఉత్తరాది రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలను భారీవర్షాలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఉత్తరప్రదేశ్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలకు 15మంది మృతి చెందగా 133 భవనాలు కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. వర్ష భీభత్సంతో భారీ ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. లక్నోలో శనివారం నుండి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందనీ భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా ప్రాంతాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాంలలో అధికవర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. మరో పక్క అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. బ్రహ్మపుత్రనది పొంగి ప్రవహిస్తోంది. అసోంలో వరదల కారణంగా ఆరుగురు మృతి చెందారు. అస్సోంలోని 21జిల్లాలకు వరద ముంపు ప్రభావం చోటుచేసుకున్నది. అధికార యంత్రాంగం 85వేల జనాభాను పునరావాస కేంద్రాలకు తరలించారు.
దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రా, తమిళనాడు ప్రాంతాల్లో వర్షాలు లేక కరవు విలయతాండవం చేస్తుండగా ఉత్తరాదిన భారీ వర్షాలతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఆంధ్రప్రదేశ్లో వర్షాల కోసం రైతులు ఎదురుతెన్నులు చూస్తున్నారు. తమిళనాడులో తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.